‘కీ’ రోల్.. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే కొత్త ఎజెండా

ఎవరు అవునన్నా.. కాదన్నా.. గతంలో మాదిరి కేంద్ర ప్రభుత్వం మీద ఏ మీడియా సంస్థ స్వేచ్ఛగా తన వాదనను వినిపించలేకపోతున్నదన్నది కఠిన వాస్తవం. దేనికి ఎలాంటి చర్యలు ఉంటాయో? ఏ కథనానికి ఎలాంటి నోటీసులు అందుతాయో? కేసుల బూచితో చెడుగుడు ఆడుకుంటాయన్న భయాందోళనలో పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే కాదు.. మీడియా సంస్థలకు కూడా తప్పలేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. కేంద్రంలోని మోడీతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఒకలాంటి యుద్ధాన్ని ప్రకటించారు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణ.

తాజాగా ఆయన తన చానల్ లో బిగ్ డిబేట్ ను నిర్వహించారు. ఈ మొత్తం డిబేట్ మూడు కీలక అంశాల చుట్టూనే తిరిగింది. ఆ విషయాన్ని ఆయనేం దాచిపెట్టలేదు సరికదా.. ఓపెన్ గానే మాట్లాడారు. ఇప్పుడీ విషయాల మీద ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా? నా వరకు నేను ఇది చేస్తున్నా.. మీ మాటేమిటి? అని అడిగేశారు కూడా. ఇక.. ఆర్కే ప్రస్తావించిన అంశాల్ని మూడుగా కుదిస్తే..

  1. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయటం.. లీజుకు ఇచ్చుకుంటూ పోతే ఫ్యూచర్ మాటేమిటి?
  2. ఐదేళ్ల పాలన కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 20-30 ఏళ్లు లీజుకు ఇచ్చే అధికారమా?
  3. అదే పనిగా సంక్షేమ పథకాలతో నిధుల్ని ఖర్చు చేస్తే మౌలిక సదుపాయాల మాటేమిటి? దేశం భవిత ఏమిటి?

ఈ బిగ్ డిబేట్ కు ఏపీకి చెందిన సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వికాస్ బన్సోడే లు ప్రత్యక్షంగా పాల్గొంటే.. లోక్ సత్తా జేపీ.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫోన్ ద్వారా లైవ్ లో చర్చలో పాల్గొన్నారు. రాజకీయనేతలు తమ స్వార్థం కోసం దేశ సంపదను తాకట్టు పెట్టే వైఖరిపై సర్వత్రా చర్చ జరగాలన్న తన అభిలాషను ఆర్కే వ్యక్తం చేశారు. దీనిపై అన్ని రంగాలకు చెందిన నిపుణులు.. మేధావులు కలిసి ప్రభుత్వాలను కట్టడి చేయాలన్న విషయాన్ని ఆయన చెప్పారు. రాష్ట్రాలు పరిమితికి మించిన అప్పులు చేయటాన్ని నిరోధించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

చర్చా కార్యక్రమంలో గంగవరం పోర్టు.. జీవీకే చేతిలో ఉన్న ఎయిర్ పోర్టును బలవంతంగా.. కేసులతో భయపెట్టి మరీ లాగేసుకున్నారన్న మాటను ప్రస్తావించటం గమనార్హం. దేశంలో అంబానీ..అదానీలు తిరుగులేని రీతిలో బలపడటం దేశానికి మంచిదేనా? అన్న ప్రశ్నను సంధించారు. కేంద్రంలోని మోడీ సర్కారు పాలసీలను సూటిగా ప్రశ్నించటమే కాదు.. వారు అనుసరిస్తున్న విధానాల్నితప్పు పట్టేందుకు వెనుకాడలేదు. గంగవరంపోర్టులో ఏపీ ప్రభుత్వం తన వాటాను అమ్మేయటంపైనా విమర్శలు ఎక్కు పెట్టిన ఆయన..విశాఖ స్టీల్ ప్లాంట్ విలువపైనా ఆసక్తికర చర్చ జరిగింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ విలువ రూ.4లక్షల కోట్లుగా ఉంటే.. దాన్ని రూ.32వేల కోట్లకే అమ్మేస్తున్నారన్న మాటను ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. ఆస్తుల్ని అమ్మి సొమ్ము చేసుకొని ఖర్చు చేయటాన్ని తప్పు పట్టారు. మానిటైజేషన్ పేరుతో జరుగుతున్న తీరును తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో ఎవరూ ప్రశ్నించలేని వాతావరణం ఉందని.. ప్రశ్నించేవారు లేకపోవటం విషాదకరమని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఆర్కే తనదైన రీతిలో స్పందించారు.

‘మీలాంటి మేధావులు.. రాజకీయ నేతలు.. ఎవరికి వారు అన్ని రంగాల వారు కలవాలి. ఒక ఫోరంలా కలిసి పని చేయాలి. ఎక్కడో అక్కడ మొదలు కావాలి కదా?’ అని పేర్కొంటూ మోడీ సర్కారు విధానాలపై వార్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు మరే మీడియా చేయని సాహసాన్ని ఆర్కే ప్రదర్శించారని అంటున్నారు. మరి.. ఇదంతా ఒక బిగ్ డిబేట్ రూపంతో ఆగుతుందా? రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళుతుందా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. దీనికి కాలమే సరైన సమాధానం చెప్పాలి.