పూరీ పంచ్ తిన్న హీరో.. మళ్లొస్తున్నాడు

పూరి జగన్నాథ్ టాలీవుడ్లో చాలామంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు. ఇమేజ్ లేని హీరోలను స్టార్లను చేయడంలో, స్టార్లను సూపర్ స్టార్లను చేయడంలో పూరి ట్రాక్ రికార్డు గొప్పదే. కానీ బయటి హీరోలకు తిరుగులేని విజయాలను కట్టబెట్టిన పూరి జగన్నాథ్.. తన కొడుకు ఆకాశ్‌ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయాడు. తాను బ్యాడ్ ఫామ్‌లో ఉండగా ‘మెహబూబా’ లాంటి డిజాస్టర్ మూవీ తీసి కొడుకు కెరీర్‌ను డోలాయమానంలోకి నెట్టాడు.

ఇలా పూరి పంచ్ తిన్న మరో కొత్త కుర్రాడు కూడా ఉన్నాడు. అతనే.. కన్నడ నటుడు ఇషాన్. శాండిల్‌వుడ్లో పెద్ద నిర్మాతల్లో ఒకడైన మనోహర్ కొడుకితను. కన్నడలో పునీత్ రాజ్‌కుమార్, తెలుగులో రామ్ చరణ్‌లను హీరోలుగా పరిచయం చేసి వాళ్లు పెద్ద స్టార్లు కావడానికి పునాది వేసిన పూరి మీద ఎంతో నమ్మకంతో ఇషాన్‌ను ‘రోగ్’ అనే మూవీతో లాంచ్ చేయించారు.

పెద్ద బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం అటు కన్నడలో, ఇటు తెలుగులో డిజాస్టర్ అయింది. డబ్బులు పోయాయి. కొత్త హీరోకు విజయం దక్కలేదు. మొత్తంగా ఇషాన్ కెరీర్ అయోమయంగా తయారైంది. ఆ తర్వాత కన్నడలో రెమో అనే సినిమా ఒకటి చేశాడు. అది కూడా అంతగా ఫలితాన్నివ్వలేదు. అయినా ఇషాన్ ప్రయత్నం ఆపలేదు. ఇప్పుడతను ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు.. తత్వమసి. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ లాంటి పేరున్న ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తేలు నిర్మిస్తున్నాడు.

ఈ రోజు రిలీజ్ చేసిన టైటిల్ లుక్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. మ్యాన్లీ లుక్స్‌తో ఆకర్షణీయంగా కనిపించే ఇషాన్.. ఈ సినిమాతో అయినా మంచి విజయాన్నందుకుని హీరోగా నిలదొక్కుకుంటాడేమో చూడాలి.