అయ్య‌న్న ఔట్‌.. మారుతున్న న‌ర్సీప‌ట్నం రాజ‌కీయం..!


మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు.. చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు రిటైర్ కానున్నారా? ఆయన‌ను ప‌క్క‌న పెట్టేందుకు పార్టీ అధిష్టానం ప్ర‌తిపాద‌న సిద్ధం చేస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు త‌మ్ముళ్లు. విశాఖ జిల్లా న‌ర్సీప‌ట్నం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్య‌న్న‌కు పార్టీలో మంచి ప‌ట్టుంది. పార్టీ ఆవిర్భ‌వించిన 1982 నుంచి ఆయ‌న టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నిక‌ల్లోనూ.. అయ్య‌న్న దిగ్విజ‌యం సాధించారు. మ‌రీ ముఖ్యంగా 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌వాను త‌ట్టుకుని నిల‌బ‌డ్డారు.

ఈ క్ర‌మంలో అయ్య‌న్న‌కు చంద్ర‌బాబు మంచి ప్రాధాన్యం ఇవ్వ‌డంతోపాటు.. మంత్రి ప‌ద‌విని కూడా క‌ట్ట‌బెట్టారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లోనే త‌న కుమారుడు చింత‌కాయ‌ల విజ‌య్ పాత్రుడికి టికెట్ ఇప్పించుకునేందుకు అయ్య‌న్న ప్ర‌య‌త్నించారు. అయితే.. వైసీపీ నుంచి బ‌లమైన పోటీ ఎదురుకావ‌డంతోపాటు.. విజ‌య్‌పై సొంత కుటుంబం నుంచే విమ‌ర్శ‌లు రావ‌డం.. బాబాయే.. ఆయ‌న‌పై చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేయ‌డంతో.. టికెట్ విష‌యానికి వ‌చ్చేస‌రికి.. చంద్ర‌బాబు మ‌రోసారి అయ్య‌న్న‌కే క‌ట్ట‌బెట్టారు. ఇక‌, ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి మారుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయ్య‌న్న‌కు కాకుండా.. మ‌రో నేత‌కు ఇవ్వాల‌ని.. రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ప్ర‌తిపాదించారు. 65 ఏళ్లు నిండిన వారికి టికెట్ ఇవ్వ‌రాద‌ని ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు..శ‌తృచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు, కిశోర్ చంద్ర‌దేవ్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు వంటివారిని ప‌క్క‌న పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో అయ్య‌న్న కూడా ఇదే జాబితాలో ఉన్నందున ఆయ‌న‌ను కూడా ప‌క్క‌న పెడితేనే.. మిగిలిన వారు.. సాన‌నుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. అంటున్నారు.

అదేస‌మ‌యంలో గ‌తంలోనే అయ్య‌న్న పోటీ నుంచి త‌ప్పుకొంటాన‌ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. సో.. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయ్య‌న్న‌ను త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఈ క్ర‌మంలో ఆయ‌న కుమారుడు విజ‌య్‌కు ఛాన్స్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి.