జ‌గ‌న్ స‌ర్కారుకు ఉద్యోగుల మంట‌.. గ్రాఫ్ డౌన్ అవుతుందా?

Jagan Mohan Reddy

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఉద్య‌మించేందుకు ఉద్యోగులు రెడీ అయ్యారు. అంతేకాదు.. చ‌రిత్ర‌లో క‌నీ వినీ ఎరుగ‌ని విధంగా స‌ప్టెంబ‌రు 1వ తేదీని పెన్ష‌న్ విద్రోహ దినంగా నిర్వ‌హించేందుకు స‌మాయ‌త్త‌మ‌య్యా రు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌పై తీవ్ర‌స్తాయిలోనే ఈ సెగ త‌గులుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పెన్ష‌న్ విద్రోహ దినం సంద‌ర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా ‘నయవంచన సభలు’ జరిపేందుకు సన్నద్ధమ వుతున్నారు. ఉద్యమ అవసరాల కోసం ఉద్యోగులే చందాలు వేసుకుని నిధులు సమకూర్చుకుంటున్నారు. ఎక్క‌డిక క్క‌డ‌.. వీరికి టీడీపీ, ఇత‌ర పార్టీలు మ‌ద్ద‌తు ఇస్తుండ‌డంతో నిర‌స‌న సెగ‌బాగానే త‌గులుతుంద‌ని వైసీపీ కూడా అంచ‌నా వేస్తోంది.

రాష్ట్రంలో సీపీఎస్‌ విధానం 2004 సెప్టెంబరు ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. సీపీఎస్‌ పరిధిలో ప్రస్తుతం 1.94 లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. కొత్త విధానం స్థానంలో పాత పెన్షన్‌ స్కీమ్‌ను (ఓపీఎస్‌) పునరుద్ధ రించాలంటూ ఇప్పటికే నెల రోజులుగా ఉద్యమిస్తున్నారు. అయినా, ప్రభుత్వం దిగిరాకపోవడంతో రాష్ట్రం లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. స‌రే.. డిమాండ్ ఏదైనా.. అస‌లు ప్ర‌భుత్వాల‌కు ఉద్యోగుల నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మైతే.. అది ఏ విధ‌మైన మ‌లుపు తిరుగుతుంది? ఎలాంటి ప‌ర్వ‌సానాలు ఎదుర‌వుతాయి..? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం.

వాస్త‌వానికి తాము ఉద్యోగుల‌కు ఫ్రెండ్లీగా ఉన్నామ‌ని.. జ‌గ‌న్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య వివాదం త‌లెత్తిన‌ప్పుడు.. ఉద్యోగులు క‌లుగ జేసుకున్నారు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలో కోర్టు నుంచి మొట్టికాయ‌లు కూడా ప‌డ్డాయి. ఇదిలావుంటే, ఇప్పుడు వారికి ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు సీపీఎస్ ర‌ద్దు చేయ‌క‌పోవ‌డం.. వారిలో ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. ఇప్పుడు అదే ఉద్య‌మంగా మారింది.

ఈ ప‌రిణామం జ‌గ‌న్ స‌ర్కారుకు ఇప్పుడున్న ప‌రిస్థితిలో గోరుచుట్ట‌పై రోక‌లి పోటుగా మారింద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వైపు ఆర్థిక స‌మ‌స్య‌లు.. మ‌రోవైపు కేంద్రం నుంచి పెనుగులాట‌లు.. ఇంకోవైపు కోర్టుల్లో నిర్ణ‌యాలు వీగిపోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఉద్యోగుల నుంచి వ్య‌తిరేక‌త మొద‌లైతే.. గ‌తంలో చంద్ర‌బాబు మాదిరిగా ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్టుకోవ‌డం కూడా జ‌గ‌న్‌కు క‌ష్ట‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్నేళ్ల కింద‌ట త‌మిళ‌నాడులోనూ.. అప్ప‌టి జ‌య‌ల‌లిత స‌ర్కారుపై ఉద్యోగులు ఆగ్ర‌హించారు. వారిని న‌యాన త‌న‌వైపు తిప్పుకోవాల్సిన జ‌య‌ల‌లిత‌.. చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఉద్యోగులు త‌మ త‌డాఖా చూపించారు. సో.. ఇప్పుడు ఎటు చూసినా.. ఉద్యోగుల స‌మ‌స్య‌.. జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌రంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.