అడ్వాన్స్ తిరిగిచ్చేసిన నవీన్ పోలిశెట్టి?

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ వంటి సినిమాలతో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. యూత్ లో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ‘జాతిరత్నాలు’ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో నవీన్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడ్డారు. భారీగా అడ్వాన్స్ లు ముట్టజెప్పారు. ఇలా అడ్వాన్ ఇచ్చిన వారిలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా ఉంది.

నవీన్ పోలిశెట్టితో సినిమా చేయడానికి సదరు సంస్థ రెమ్యునరేషన్ గా రూ.4 కోట్లు ఫిక్స్ చేసింది. నవీన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ‘రంగ్ దే’ సినిమాకి కో డైరెక్టర్ గా పని చేసిన ఓ వ్యక్తితో నవీన్ కి కథ చెప్పించారు. కథలో నవీన్ కొన్ని మార్పులు చేర్పులు కూడా చెప్పారు. అలా చేసినా కూడా కథ ఓ కొలిక్కి రాలేదని సమాచారం. నవీన్ కి కథ సంతృప్తిగా అనిపించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడట.

అంతేకాదు.. సితార సంస్థ వద్ద తీసుకున్న అడ్వాన్స్ కూడా వెనక్కి తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ మాత్రం నవీన్ పోలిశెట్టి కోసం కథలు వెతుకుతూనే ఉంది. ఈ సంస్థతో పాటు యూవీ క్రియేషన్స్ లో కూడా నవీన్ అడ్వాన్స్ తీసుకున్నారు. నిజానికి యూవీ సంస్థలో ఈపాటికే సినిమా మొదలుకావాలి. కానీ ఇప్పటివరకు సినిమాకి సంబంధించి ఎలాంటి ఊసు లేదు.