ఈసారి కూడా ఇడుపులపాయలో అన్నాచెల్లెలు ఎదురుపడనట్లే

సెప్టెంబరు 2.. ఇప్పుడీ డేట్ హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల రాజకీయనేతలతో పాటు.. సామాన్యులంతా సెప్టెంబరు 2 వంక ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తీవ్ర ఉత్కంఠను రేపుతున్న ఇదే రోజున దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి జరగనుంది. జయంతి రోజున వైఎస్ కుమారుడు కమ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కుమార్తె షర్మిలలు ఎవరికి వారుగా ఇడుపుల పాయలో నివాళులు అర్పించటం తెలిసిందే. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేయటం జగన్ కు ఇష్టం లేకున్నా.. ఆయన సోదరి షర్మిల అన్న మాటకు భిన్నంగా పార్టీని ఏర్పాటు చేయటం వారి మధ్య దూరాన్ని పెంచటం తెలిసిందే.

ఈ వాదనలో నిజం ఉందన్న విషయం వైఎస్ జయంతిరోజున ఎవరికి వారు వేర్వేరుగా నివాళులు అర్పించి వెళ్లిపోవటం తెలిసిందే. ఇక.. వీరిద్దరూ రాఖీ రోజున అయినా కలుస్తారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇరువురికి సంబంధించిన సన్నిహితుల అంచనాలకు తగ్గట్లే.. రాఖీ రోజున ఈ అన్నాచెల్లెలు కలవలేదు. కాకుంటే.. షర్మిల మాత్రం ఒక ట్వీట్ చేశారు. మరో రెండు రోజుల్లో వైఎస్ వర్థంతి నేపథ్యంలో.. జగన్.. షర్మిలలు కలిసి తమ తండ్రికి నివాళులు అర్పిస్తారా? లేక విడిగానా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

సెప్టెంబరు రెండున వైఎస్ 12వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లో వైఎస్ సతీమణి విజయమ్మ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ సంస్మరణ సభకు వైఎస్ మంత్రివర్గంలోని సభ్యులకు ఆహ్వానాలు అందటం.. వారు వస్తారా? లేదా? అన్నదిప్పుడు మరో చర్చగా మారింది. ఈ కార్యక్రమానికి షర్మిల కూడా హాజరవుతున్నారు. దీంతో.. వారు ఇడుపులపాయలో వైఎస్ కు నివాళులు ఎప్పుడు అర్పించి హైదరాబాద్ వచ్చేస్తారన్నది ప్రశ్నగా మారింది.

దీనికి కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి నివాళులు అర్పించేందుకు ఉదయమే వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఉదయం 11 గంటలకే ఆయన తాడేపల్లికి బయలుదేరుతారని చెబుతున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. జగన్ తాడేపల్లికి బయలుదేరిన వెంటనే.. విజయమ్మ.. షర్మిలలు వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. హైదరాబాద్ బయలుదేరుతారని చెబుతున్నారు. దీంతో.. ఈసారికి అన్నాచెల్లెలు ఇద్దరు ఎదురుపడే అవకాశం లేనట్లేనని స్పష్టం చేస్తున్నారు.