మైనస్ 28 డిగ్రీస్‌లో సినిమా థియేటర్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఇప్పుడో థియేటర్ ఏర్పాటైంది. సముద్ర మట్టాని కంటే ఏకంగా 11562 అడుగుల ఎత్తులో ఏర్పాటైన థియేటర్ అది. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 28 డిగ్రీలు కావడం గమనార్హం. అలాంటి చోట మనిషి మామూలుగా బతకడమే కష్టం. అక్కడ థియేటర్ ఏంటి అనిపిస్తోందా? కానీ ఇది నిజం. ఈ అద్భుతం చోటు చేసుకున్నది ఇండియాలోనే కావడం విశేషం.

కేంద్ర ప్రాంత పాలితమైన లద్దాక్‌లో మంచు పర్వతాల మీద మంచుతో అంతా గడ్డ కట్టుకుపోయి ఉండే ప్రాంతంలో ఒక మిని థియేటర్ ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే సముద్ర మట్టం నుంచి అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉన్న థియేటర్‌గా రికార్డులకెక్కింది. పిక్చర్ టైమ్ పేరుతో ఒక టెంట్ ఏర్పాటు చేసి.. లోపల సాధారణ ఉష్ణోగ్రతలను ఏర్పాటు చేసి మూవీ స్క్రీన్, ప్రొజెక్టర్, సీటింగ్ ఏర్పాటు చేశారు.

ఇక్కడ ప్రదర్శితమైన తొలి చిత్రం.. దేశభక్తి ప్రధానంగా తెరకెక్కింది కావడం విశేషం. ఆ చిత్రమే.. బెల్‌బాటమ్. 80వ దశకంలో భారత్ లక్ష్యంగా జరిగిన ఒక హైజాక్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. రంజిత్ తివారి దర్శకుడు. రెండు వారాల కిందటే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఇప్పుడు లద్దాక్‌లో ఏర్పాటైన మినీ థియేటర్లో ప్రదర్శించారు. ఆ ప్రాంతంలోని కొందరు సాధారణ పౌరులతో కలిసి సైనికులు ఈ సినిమాను వీక్షించారు.

హైజాక్ ఆపరేషన్ నేపథ్యంలో దేశభక్తి ప్రధానంగా తెరకెక్కిన సినిమా కావడంతో ‘బెల్ బాటమ్’ను సైనికులు బాగా ఎంజాయ్ చేసి ఉంటారనడంలో సందేహం లేదు. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం దక్కకపోయినా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మితమైన థియేటర్లో ప్రదర్శితమైన తొలి చిత్రంగా ఘనత వహించింది.