‘ఇండియన్-2’పై కమల్ కీలక ప్రకటన

ఎన్నో అంచనాలతో మూడేళ్ల కిందట మొదలైన ‘ఇండియన్-2’ పరిస్థితి ఎలా తయారైందో తెలిసిందే. కమల్ మేకప్ విషయంలో సమస్యలు తలెత్తడం, ఆయన రాజకీయ కమిట్మెంట్లు, అలాగే షూటింగ్‌లో జరిగిన భారీ క్రేన్ ప్రమాదం, కరోనా మహమ్మారి.. ఇలా రకరకాల కారణాల వల్ల ఆ చిత్రానికి బ్రేకులు పడ్డాయి. క్రేన్ ప్రమాదం తర్వాత నిర్మాతలతో హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్‌లకు తలెత్తిన విభేదాల వల్ల ఈ చిత్రం ముందుకే కదల్లేదు.

ఒక దశలో ఈ చిత్రం ఆగిపోయినట్లే అని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటికే రూ.180 కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఈ సినిమాను అటకెక్కించే సాహసం చేయలేకపోయారు. కానీ కమల్, శంకర్‌లతో వాళ్లకు తలెత్తిన విభేదాలు పరిష్కారం కాకపోవడంతో ఈ సినిమా తిరిగి పట్టాలెక్కలేకపోయింది. కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి అప్‌డేట్సే లేవు. శంకర్.. దీన్ని పక్కన పెట్టేసి రామ్ చరణ్ సినిమాను మొదలుపెట్టేస్తుండటంతో ‘ఇండియన్-2’ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

ఐతే ఎట్టకేలకు ‘ఇండియన్-2’ గురించి ఒక సానుకూల వార్త బయటికి వచ్చింది. ఈ చిత్రం మధ్యలో ఆగిపోవడానికి ముఖ్య కారకుడిగా భావిస్తున్న కమల్ హాసనే ఈ అప్‌డేట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియన్-2’ త్వరలోనే పున:ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. నిర్మాతలు, శంకర్‌తో మాట్లాడి విభేదాలు పరిష్కరించుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని కమల్ తెలిపాడు.

క్రేన్ ప్రమాద బాధితులను ఆదుకునే విషయంలో నిర్మాతలు సరిగా స్పందించలేదని, ఆ ప్రమాదం జరగడానికి నిర్మాతల నిర్లక్ష్యమే కారణమని కమల్ వాదనకు దిగి షూటింగ్ పున:ప్రారంభించలేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ చిత్రం గురించి ఎటూ తేల్చకుండానే ఆయన ‘విక్రమ్’ను మొదలుపెట్టేశారు. కాబట్టే శంకర్ కూడా చరణ్ చిత్రంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కమలే స్వయంగా విభేదాలు పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని, విక్రమ్ అవ్వగానే ఇండియన్-2ను పున:ప్రారంభించేందుకు ప్రయత్నిస్తానని చెప్పడంతో సమస్య దాదాపు తీరిపోయేలాగే కనిపిస్తోంది.