జగన్ సర్వే టీడీపీకి ఊపిరి పోసిందే!

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న రెండున్న‌రేళ్ల పాల‌న పూర్తి అవుతున్న సంద‌ర్భంగా చేయించుకున్న స‌ర్వే వైసీపీలో ఆందోళ‌న‌ను రేకెత్తిస్తే.. టీడీపీకి ఏకంగా ఊపిరే పోసింద‌ట‌. రాజ‌కీయాల్లో ఓ పార్టీ ఆందోళ‌న‌లో కూరుకుపోతే.. దాని ప్రత్య‌ర్థికి కొత్త శ‌క్తి వ‌చ్చిన‌ట్టే క‌దా.

ఆ లెక్క మాదిరిగానే.. ఏపీలో వైసీపీలో కొత్త‌గా రేకెత్తిన ఆందోళ‌న‌.. టీడీపీకి కొత్త జ‌వ‌స‌త్వాల‌ను ఇచ్చింద‌ట‌. ఇందుకు నిద‌ర్శ‌నంగా వైసీపీ అధికారంలోకి రాగానే.. దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన‌ట్లుగా క‌నిపించిన టీడీపీ కీల‌క నేత‌లు ఒక్కరొక్క‌రుగా మ‌ళ్లీ తెర ముందుకు వ‌స్తున్నార‌ట‌. ఈ ప‌రిణామాలు టీడీపీలో కొత్త ఆశ‌ల‌ను చిగురింప‌జేస్తుంటే.. వైసీపీలో మాత్రం బీపీని పెంచేస్తున్నాయ‌ట‌.

2019 ఎన్నిక‌ల్లో వైసీపీ బంప‌ర్ విక్ట‌రీ కొట్ట‌గానే.. ఊహ‌కే అంద‌ని పూర్ ఫెర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌ర‌చిన టీడీపీ విప‌క్ష స్థానంలో కూర్చోక త‌ప్ప‌లేదు. అయితే సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం రోజే.. టీడీపీ పాల‌న‌పై విచార‌ణ జ‌రుపుతామంటూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు టీడీపీ శ్రేణుల్లో పెను క‌ల‌వ‌రాన్నే రేపాయి. ఈ క్ర‌మంలో టీడీపీ హ‌యాంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారంతా క్ర‌మంగా అదృశ్య‌మ‌య్యారు. కొంద‌రు త‌మ కార్య‌క్షేత్రాన్ని దాదాపుగా మూసేస్తూ హైద‌రాబాద్ చేరుకుంటే.. మ‌రికొంద‌రు రాజకీయాల‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లెట్టారు. ఈ క్ర‌మంలో టీడీపీ శ్రేణులు దిక్కు తోచ‌ని స్థితిలో ప‌డిపోయాయి. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ తీసుకున్నా.. అంత తొంద‌ర‌గా ఫ‌లితాలు రావ‌డం లేదు. అయితే ఇటివ‌లి ప‌రిణామాలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయ‌నే చెప్పాలి.

గ‌తంలో మాదిరిగా నారా లోకేశ్ అలా వ‌చ్చాం.. ఇలా వెళ్లాం అన్న రీతిగా కాకుండా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీపై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను తెలుసుకునేందుకు జ‌గ‌న్ చేయించుకున్న స‌ర్వేలో.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ఏకంగా 60 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోతార‌ని, వీరిలో ఏకంగా 11 మంది మంత్రులు కూడా ఉన్నార‌ని, మ‌రో 20 మంది దాకా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గ‌ట్టి పోటీని ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని తేలింది. ఈ వార్త‌ల‌తో వైసీపీలో ఒక్క‌సారిగా నిస్స‌త్తువ ఆవ‌హించింది.

అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్లు ఉండ‌గానే.. వైసీపీపై వ్య‌తిరేక‌త ఏర్ప‌డిందంటే.. భ‌విష్య‌త్తు త‌మ‌దేన‌న్న భావ‌న టీడీపీలో వ్య‌క్త‌మైంది. ఈ విష‌యం తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నేత‌లంతా వ‌రుస‌గా విజ‌య‌వాడ‌కు క్యూ క‌డుతున్నార‌ట‌. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి విజ‌య‌వాడ చేరుకుని యాక్టివ్ గా మారిపోయార‌ట‌. ఇదే బాట‌లో మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు కూడా యాక్టివేట్ అవుతున్నార‌ట‌. వెర‌సి వైసీపీ చేయించుకున్న స‌ర్వే టీడీపీలో జోష్ నింపింద‌న్న మాట‌.