నానీని ఇలా టార్గెట్ చేస్తున్నారేంటి?

నేచురల్ స్టార్ నాని తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాడిప్పుడు. ఆల్రెడీ ‘వి’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల అతడి అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు గత ఏడాది. ఐతే ఆ సినిమాకు ఎలాగూ నెగెటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఓకే అనుకున్నారు. కానీ ‘టక్ జగదీష్’ సినిమాను బిగ్ స్క్రీన్లలోనే చూడాలని అభిమానులు కోరుకుంటుంటే.. ఆ చిత్ర నిర్మాతలు అనివార్య పరిస్థితుల్లో ఓటీటీ వైపు అడుగులేశారు. నెలన్నర ముందే ఈ సినిమాకు డీల్ పూర్తయిందంటున్నారు. నిర్మాతలకు అడ్డం పడలేక నాని సైలెంటుగా ఉండిపోయాడని స్పష్టమవుతోంది. తన పరిస్థితిని వివరిస్తూ ఇటీవలే అతను ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం తెలిసిన సంగతే.

ఐతే తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ.. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా ధైర్యంగా థియేటర్లలోకి దిగుతుంటే.. నాని లాంటి స్టార్ నటించిన చిత్రాన్ని ఓటీటీలో విడుదల కావడం ఏంటనే ప్రశ్నలు ప్రేక్షకులు నుంచి వస్తున్నాయి. ‘టక్ జగదీష్’ వినాయక చవితి కానుకగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. నాని నటించిన మరో సినిమాకు కూడా ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘టక్ జగదీష్’ తర్వాత నాని పూర్తి చేసిన ‘శ్యామ్ సింగరాయ్’కి ఒక ఓటీటీ రూ.40 కోట్లు ఆఫర్ చేసిందట.

నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. అయినప్పటికీ ఈ డీల్ లాభదాయకమే అని నిర్మాతలు భావిస్తున్నారట. వాళ్లు ఆసక్తితోనే ఉన్నప్పటికీ.. నాని మాత్రం ఈ డీల్‌కు ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఈ సినిమాను కూడా థియేటర్లలో రిలీజ్ చేయకపోతే ఇక తనను అందరూ ఓటీటీ స్టార్ అనేస్తారన్న భయం నానీని వెంటాడుతున్నట్లుంది.

‘టక్ జగదీష్’ నిర్మాతలైతే కాస్త పేరున్న వాళ్లు. నాని వారిని అడ్డుకోలేకపోయాడు. కానీ ‘శ్యామ్ సింగరాయ్’ను నిర్మించింది ఓ కొత్త నిర్మాత. అతణ్ని ఆపి థియేటర్లలోనే సినిమాను రిలీజ్ చేసేలా ఒప్పించగలడనే అంటున్నారు. ఐతే ఓటీటీలు వరుసగా నాని సినిమాలను టార్గెట్ చేస్తుండటం మాత్రం చర్చనీయాంశమవుతోంది. ‘వి’ డివైడ్ టాక్‌తోనూ పెద్ద ఎత్తున వ్యూస్ తెచ్చుకోవడంతో ఓటీటీలు అతడి సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నట్లున్నాయి.