ఇంద్రగంటి వారి కొత్త అవతారం

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో దాదాపుగా అందరూ ఏదో రకంగా సినిమా ప్రొడక్షన్లలో భాగం అయిన వాళ్లే. కొందరు సొంతంగా బేనర్లు పెట్టుకుంటే.. కొందరేమో వేరే వాళ్ల భాగస్వామ్యంతో సినిమాలు నిర్మిస్తున్నారు. తమ బ్రాండ్‌నే పెట్టుబడిగా పెట్టి సినిమాల్లో వాటాలు తీసుకుంటున్న దర్శకులూ ఉన్నారు. ఇప్పుడు మరో ప్రముఖ దర్శకుడు నిర్మాతగా మారుతున్నాడు. ఆయనే ఇంద్రగంటి మోహనకృష్ణ.

దాదాపు రెండు దశాబ్దాలుగా దర్శకత్వ ప్రయాణం చేస్తున్న ఇంద్రగంటి ‘గ్రహణం’ మొదలుకుని ‘వి’ వరకు రకరకాల జానర్లలో సినిమాలు చేశాడు. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా ‘అ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్ అనే కొత్త నిర్మాణ సంస్త ప్రొడ్యూస్ చేస్తోంది. ఇదే సంస్థతో కలిసి ఇంద్రగంటి నిర్మాణంలో అడుగు పెడుతుండటం విశేషం. ఇది కొత్త నటీనటులతో తెరకెక్కబోయే చిత్రం అని తెలుస్తోంది.

ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వీడియోతో అప్‌డేట్ ఇచ్చాడు ఇంద్రగంటి. ఒక పల్లెటూరి కుర్రాడు ఇంద్రగంటి సినిమా కోసమని ఆడిషన్ చేస్తున్న వీడియోను ఇంద్రగంటినే రిలీజ్ చేయడం విశేషం. ఇది సినిమా కోసం కాస్టింగ్ కాల్ ఇవ్వడంలో భాగంగా రిలీజ్ చేసిన వీడియోలాగా ఉంది. ఫన్నీగా ఉన్న ఆ వీడియో ఆసక్తి రేకెత్తిస్తోంది. బహుశా ఈ చిత్రాన్ని ఏదైనా ఓటీటీ కోసం రూపొందిస్తుండొచ్చు.

మెయిల్, సినిమా బండి తరహాలో తక్కువ బడ్జెట్లో సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఇంద్రగంటి అండ్ కో ఉన్నట్లుంది. తాను తీసే సినిమాలతో మంచి అభిరుచిని చాటుకున్న ఇంద్రగంటి.. నిర్మాణంలోనూ తన ముద్రను చూపిస్తారని ఆశించవచ్చు. మరి నిర్మాతగా ఆయనకు ఎలాంటి ఆరంభం దక్కుతుందో చూడాలి. ఇక దర్శకుడిగా ఇంద్రగంటి కెరీర్ విషయానికి వస్తే.. ‘వి’తో పెద్ద షాక్ తిన్న ఆయన మళ్లీ తన స్టయిల్లో తీస్తున్న లవ్ స్టోరీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో కచ్చితంగా పుంజుకుంటారనే అనిపిస్తోంది.