తాలిబాన్లతో మీరు మాట్లాడండి.. ఓవైసీకి రాములమ్మ కౌంటర్

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పై బీజేపీ మహిళా నేత విజయశాంతి కౌంటర్ వేశారు. ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించుకున్న విషయమై.. ఓవైసీ చేసిన కామెంట్స్ పై రాములమ్మ కౌంటర్ వేయడం గమనార్హం. బుధవారం అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. భారత్ తాలిబన్లతో చర్చలు జరపాలని సూచించారు.

దీనిపై స్పందించిన విజయశాంతి దీటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. “తాలిబన్లతో మీరే చర్చలు జరిపి రండి” అని సమాధానం ఇచ్చారు. “భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థమేమిటో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకే తెలియాలి. అంతకన్నా, ఒవైసీ జీ స్వయంగా కాబూల్ వెళ్ళి తాలిబన్లలతో చర్చలు జరిపి వచ్చి, సమాచారం అందిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సమంజసంగా ఉంటుందేమో ప్రయత్నిస్తే మంచిది.” అని విజయశాంతి ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

కొద్ది రోజులుగా అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రెండ్రోజుల కిందట స్పందించారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు దురాక్రమించుకున్న వేళ ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై భారత ప్రభుత్వం అవలంబించబోయే వైఖరిని వెల్లడించాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.

అఫ్గానిస్థాన్‌లో భారత ప్రభుత్వం 3 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి పార్లమెంటు భవనం, ఓ రిజర్వాయర్ కూడా నిర్మించిందని ఒవైసీ గుర్తు చేశారు. తాజాగా తాలిబన్ల దురాక్రమణతో భారత్ అక్కడ చేసిన అభివృద్ధి అంతా వృథా అయిపోయిందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ విషయంలో భారత ప్రభుత్వం గతంలోనే స్పందించాల్సి ఉందని ఒవైసీ అన్నారు.