తెలంగాణా హైకోర్టు ఆదేశాలు ఏపీకీ వర్తించాలి

రెండు రాష్ట్రాల్లోను ఒక పద్ధతి జరుగుతోంది. ముందుగా ఈ విషయం తెలంగాణ హైకోర్టుకు చేరింది. దాంతో కేసును విచారించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. మరి కోర్టు చివాట్లతో జగన్మోహన్ రెడ్డి మేల్కొంటారా ? ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో మొదలైన దళిత బంధు పథకంపై కోర్టులో పిటీషన్ పడింది. పథకం విధి విధానాలు ఏమిటో వివరించకుండా, జీవో విడుదల చేయకుండానే పథకాన్ని ఎలా అమలు చేస్తారంటు కేసు వేశారు.

ఇదే విషయాన్ని విచారించిన హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పథకానికి సంబంధించిన విధానాలు రెడీ అయ్యాయని, జీవో మాత్రం బహిరంగంగా విడుదల కాలేదని అందుకే ప్రజలకు అందుబాటులో లేదని ప్రభుత్వం లాయర్ వివరించారు. దాంతో హైకోర్టు ప్రభుత్వ లాయర్ పై మండిపడింది. ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలను తెలిపే జీవోలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం ఏమిటంటూ నిలదీసింది.

ప్రభుత్వంలో పారదర్శకత చాలా అవసరమని గట్టిగా హెచ్చరించింది. చాలా రాష్ట్రాల్లో జీవోలు ఆఫ్ లైన్లోనే ఉంటున్నాయన్న లాయర్ వాదనను కోర్టు వినిపించుకోలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న 24 గంటల్లో సదరు నిర్ణయాలు జీవోల రూపంలో పబ్లిక్ డొమైన్ లో ఉంచాల్సిందే అని ఆదేశించింది. తెలంగాణా విషయాన్ని ఇక్కడితో ఆపేసి ఏపీలో ఏమి జరుగుతుందో చూద్దాం. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల తాలూకు జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే.

ప్రభుత్వ నిర్ణయాలు జీవోల రూపంలో 2008 నుండి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నది. ఈ జీవోల్లో ప్రజలు చూడగలిగినవి, కాన్ఫిడెన్షియల్ అనేవి ఉంటాయి. అయితే కాన్ఫిడెన్షియల్ జీవోలు పెరిగిపోతున్నాయని, వీటితో పాటు బ్లాంక్ జీవోలు కూడా పెరిగిపోతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ హయాంలో కూడా కాన్ఫిడెన్షియల్ జీవోలు కొన్ని ఉండేవి. అప్పట్లో ఇదే విషయమై జగన్ ఆరోపణలు చేశారు. కాబట్టి ఇపుడు టీడీపీ నేతలు పదే పదే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

జీవోలను కాన్ఫిడెన్షియల్ గా ఉంచటం, వాటిని ఏదోలా సంపాదించి ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేయటంతో ప్రభుత్వానికి చికాకుగా మారింది. దాంతో ఏకంగా జీవోలను పబ్లిక్ డొమైన్లోనే పెట్టకుండా ఉంటే సరిపోతుందని ప్రభుత్వం అనుకున్నది. అయితే ప్రభుత్వం ఇక్కడే తప్పుగా ఆలోచించింది.

తప్పు నిర్ణయాలు తీసుకోవడం, తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్లుగా జీవోలు విడుదల కాకపోతే సమస్యలు వస్తాయి. నిర్ణయాలు తీసుకోవడంలో పారదర్శకత ఉంటే జీవోల గురించి ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే జీవోల విషయంలో తెలంగాణా హైకోర్టు ఆదేశాలతో జగన్ కూడా నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేకపోతే కోర్టు నుంచి తలంటు తప్పదు.