విశాఖ ఉక్కు టాటా స్టీల్స్ అయిపోతుందా ?

Vizag Steel Plant

విశాఖపట్నంలోని ఉక్కు ఫ్యాక్టరీని టాటా స్టీల్ కొనుగోలు చేయబోతోందా ? కొనుగోలు విషయంలో తమకు ఆసక్తి ఉందని కంపెనీ సీఈవో, ఎండి టీవీ నరేంద్రన్ మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ను నూరుశాతం ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని కేంద్రం ఇప్పటికే డిసైడ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నూరుశాతం ప్రైవేటీకరణ చేయడం. లేకపోతే సంస్ధను మూసేయాలని కేంద్రం డిసైడ్ చేసింది.

కేంద్రం అమ్మేయాలని డిసైడ్ అయితే చేసింది కానీ కొనుగోలుకు తాము ఆసక్తిగా ఉందని ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. ఇదే సమయంలో స్టీల్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేయమని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఈ విషయమై నరేంద్ర మోడీ సర్కార్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనబడలేదు. దాంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అర్ధంకాక అందరూ వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే టాటా స్టీల్స్ విషయం వెలుగులోకి వచ్చింది. సరే నరేంద్రన్ దీన్ని ధృవీకరిస్తూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయటం వల్ల తమకుండే లాభాలను, వ్యాపార విస్తరణకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏ వ్యాపారైనా లాభాలు వస్తుందని అనుకుంటేనే ముందడుగు వేస్తారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే ఆసక్తి ఉన్నంత మాత్రాన విశాఖ స్టీల్ ను టాటా స్టీల్స్ కు ఇచ్చేయవచ్చా ? అన్నదే డౌటు.

విశాఖ స్టీల్స్ అమ్మకానికి కేంద్రం కనుక వేలంపాట పెడితే ఎంత ధర వస్తుందన్నది చూడాలి. సొంతానికి ఇనుప గనులు లేని కారణంగానే స్టీల్ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. అదే కనుక విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సొంతంగా గనులను కేటాయిస్తే లాభాల్లోకి రావటానికి ఎక్కువ కాలం పట్టదన్న విషయం అందరికీ తెలిసిందే. వైజాగ్ స్టీల్ ను కొనుగోలు చేయడానికి ఎవరికి ఆసక్తి ఉన్నా బిడ్డింగ్ ద్వారా మాత్రమే సాధ్యం. పైగా ఈ సంస్థను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే సంస్ధకున్న వేలాది ఎకరాల భూమి.