ఓటీటీకి వెళ్లారా.. గప్‌చుప్


ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ ఎంత కీలకంగా మారిందో తెలిసిందే. పెద్ద స్టార్లు నటించిన సినిమాలు కదా.. ప్రత్యేకంగా ప్రమోషన్లేమీ అక్కర్లేదని ఊరుకోవడానికి లేదు. కలెక్షన్లు పూర్తిగా ఓపెనింగ్స్ మీదే ఆధారపడ్డ ఈ రోజుల్లో ఎంత కుదిరితే అంత హైప్ తీసుకొచ్చి తొలి వారాంతం, తొలి వారంలో వీలైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టుకోవడమే లక్ష్యంగా మారిపోయిన ఈ రోజుల్లో.. సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందే ప్రమోషన్ మొదలైపోతుంటుంది. నిరంతరం చిత్రాన్ని వార్తల్లో నిలబెట్టడం చాలా అవసరం. వివిధ దశలో అప్‌డేట్స్ ఇస్తుండాలి. ఏదో ఒక విశేషాన్ని పంచుకుంటూ ఉండాలి. అది అనివార్యమైన ప్రక్రియగా మారిపోయింది.

ఎంత షూటింగ్‌లో.. పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నా సరే.. ప్రమోషన్ సంగతి మాత్రం మరిచిపోకూడదు. ప్రి రిలీజ్ ప్రమోషన్ అనేది అత్యంత కీలకమైన విషయం. కానీ టాలీవుడ్లో తెరకెక్కిన కొన్ని క్రేజీ చిత్రాల విషయంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

టక్ జగదీష్.. విరాట పర్వం.. దృశ్యం-2.. మ్యాస్ట్రో.. ఇవన్నీ తెలుగులో తెరకెక్కిన క్రేజీ చిత్రాలు. ఇవన్నీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ వీటి గురించి అసలు వార్తలే లేవు ఎక్కడా. రిలీజ్ గురించి అప్‌డేట్ లేదు. ఒక పాట రిలీజ్ చేయడమో.. ఇంకే రకంగా అయినా ప్రమోట్ చేయడమో ఏమీ చేయట్లేదు చిత్ర బృందాలు. ఈ చిత్రాలన్నింటికీ ఓటీటీ డీల్స్ అయిపోయాయని అంటున్నారు. కానీ ఆ విషయం వెల్లడించట్లేదు. నిర్మాతలు ఓటీటీ బాట పడుతుండటాన్ని ఎగ్జిబిటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ హెచ్చరికలు జారీ చేస్తుండటం వల్లో ఏమో.. వీటి నిర్మాతలు మౌనం వహిస్తున్నారు.

ఐతే అసలు వార్తల్లో లేకపోవడం వల్ల ఈ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లిపోతోంది. ప్రి రిలీజ్ హైప్ అనేదే కనిపించడం లేదు. రేప్పొద్దున ఓటీటీల్లోనే రిలీజైనా కూడా ఇంత లో బజ్ అన్నది చేటు చేసేదే. ఓటీటీలకు అమ్మేశాం ఇక తమ పనైపోయిందన్నట్లు ఆయా చిత్ర బృందాలు ఉండటం ఎంత వరకు కరెక్టో ఆలోచించాలి. ఇలా చేస్తూ పోతే మున్ముందు ఓటీటీలు ఇచ్చే రేట్లు తగ్గిపోతాయి. క్రమంగా ఇది చేటు చేసేదే.