తాలిబన్ల దెబ్బ అంత గట్టిగా పడిందా ?

ఆఫ్ఘనిస్ధాన్ లో తాలిబన్ల అరాచకాలను విదేశాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రాజధాని కాబూల్ నుండి తమ రాయబార కార్యాలయాల్లోని ఉన్నతాధికారులను, ఉద్యోగులందరినీ తిరిగి వచ్చేయాలంటు ఆయా దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. అన్నీ దేశాలకన్నా ముందుగా అమెరికా, ఇండియాలు తమ సిబ్బందిని వెనక్కు పిలిపించేస్తున్నాయి. అమెరికా అయితే తమ మిలిట్రీని దగ్గరుండి మరీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వారందరినీ విమానాలెక్కించేస్తోంది.

విమానాల్లో ప్రయాణించటానికి కుదరని ఉద్యోగుల కోసం ప్రత్యేకించి హెలికాప్టర్లలో సమీప ప్రాంతాలకు తరలించి అక్కడినుండి విమానాల్లో వచ్చే ఏర్పాట్లు చేసింది. ఇదే పద్దతిలో భారత ప్రభుత్వం కూడా సిబ్బందిమొత్తాన్ని దేశానికి తిరిగి వచ్చేయాలని ఆదేశించింది. ఆఫ్ఘన్లో ఉండటం ఇపుడు ఎంతమాత్రం క్షేమంకాదని స్పష్టంగా చెప్పింది. కాబూల్ లోని సుమారు 70 విదేశాల రాయబార కార్యాలయాలు కూడా తమ ఉద్యోగులను ఖాళీ చేయిస్తున్నాయి.

ఇదే సమయంలో దేశ సరిహద్దులన్నింటినీ తాలిబన్లు స్వాధీనం చేసేసుకున్నారు. కాబూల్ లోకి తాలిబన్ సైన్యం ప్రవేశించింది. రాజధానిలోని కీలకమైన ప్రాంతాలను తమ గుప్పిట్లోకి ఉగ్రాదులు తెచ్చేసుకున్నారు. దేశంలో ఉన్న 32 రాష్ట్రాల్లో ఇప్పటికే 20 రాష్ట్రాలు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. కాబూల్ లో కాల్పులు జరపవద్దని, ప్రజలకు ఎలాంటి నష్టమూ చేయవద్దని ప్రభుత్వం పదే పదే వేడుకుంటోంది. ప్రభుత్వవైఖరి చూస్తుంటే ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. ఫలితంగా దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు.

ఇప్పటికే ఆర్ధికమంత్రితో పాటు చాలామంది మంత్రులు, గవర్నర్లు దేశంనుండి పరారయ్యారట. అంటే మంత్రులు తాలిబన్లకు దొరక్కుండా తమ దారి తాము చూసుకుంటున్నారు. దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా గల్ఫ్ దేశాలకు కానీ లేదా అమెరికాకు కూడా పారిపోవచ్చనే ప్రచారం పెరిగిపోతోంది. ఆఫ్ఘన్లో తాలిబన్లు ఇంత అరాచకాలకు పాల్పడుతున్నా పేరుగొప్ప ఐక్యరాజ్యసమితి ప్రకటనలు ఇవ్వటం, ఆందోళన వ్యక్తంచేయటం మినహా ఇంకేమీ చేయలేకపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది.