క్యాబినెట్ ప్రక్షాళనపై కీలక నిర్ణయం ?

తొందరలో జరుగుతుందని అనుకుంటున్న మంత్రివర్గ ప్రక్షాళనపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులుంటాయని 2019 ప్రమాణస్వీకారం సందర్భంలోనే జగన్ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనకు అనుగుణంగా రాబోయే విజయదశమి పర్వదినం నాటికి ప్రక్షాళన చేయాలని ముహూర్తం డిసైడ్ చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ప్రస్తుత మంత్రివర్గంలోని 25 మందిలో సుమారుగా 18 మందిని మార్చేయాలని జగన్ నిర్ణయించుకున్నారట. పనితీరు+సామాజికవర్గాల సమీకరణలు+మంత్రులపై వినిపిస్తున్న ఆరోపణల్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే భారీ ప్రక్షాళనకు జగన్ రెడీ అవుతున్నారట. ఇపుడున్న 25 మంది మంత్రుల్లో 23 మంది రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇద్దరు మంత్రులు సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన గోపాలకృష్ణ మాత్రం రాజ్యసభ ఎంపీలుగా వెళిపోయిన మోపిదేవి వెంకటరమణ, సుభాష్ చంద్రబోస్ ప్లేసులో బాధ్యతలు తీసుకున్నారు.

కాబట్టి మొత్తం 25 మందిలో 18 మందిని మార్చేస్తారా ? లేకపోతే 23 మంది లో మారుస్తారా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఏదేమైనా మంత్రివర్గంలో వీలున్నన్ని సామాజికవర్గాలకు జగన్ అవకాశాలు కల్పించారు. మంత్రివర్గంలో కేవలం నలుగురు మాత్రమే రెడ్లుండటం వల్ల మెజారిటీ రెడ్లలో జగన్ పై అసంతృప్తిగా ఉంది. అయితే ఈ విషయంలో జగన్ చేయగలిగేది ఏమీలేదు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలంటే సొంత సామాజిక వర్గానికి పరిమితం చేయాలని డిసైడ్ అయ్యారు.

ఈ కారణం వల్లే రోజా లాంటి అనేక మందికి తీవ్ర అసంతృప్తిగా ఉంది. బహుశా వచ్చే ప్రక్షాళనలో కూడా వీళ్ళకు అవకాశం దక్కకపోవచ్చు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సామాజిక వర్గాల విషయంలో జగన్ ఓ వ్యూహం ప్రకారం వెళుతున్నారు. అందుకనే బీసీ సామాజికవర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ పోస్టులు బీసీలకే ఇచ్చినా పవరున్న పోస్టులు రెడ్లకు ఇచ్చారన్న ఆరోపణ అయితే ఉంది. అయినా ఎక్కువ పోస్టులు రాలేదన్న ఆవేదన పార్టీలోని రెడ్లలో వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు టార్గెట్ గా పనిచేస్తు బీసీలను, ఎస్సీలను జగన్ టార్గెట్ చేస్తున్నారు.

ఇప్పుడున్న మంత్రుల్లో 18 మంది స్ధానంలో అదే సామాజిక వర్గాలకు చెందిన వారిని కానీ లేకపోతే ఇపుడు అవకాశం దక్కని సామాజికవర్గాలకు చెందిన వారిని కానీ మంత్రులుగా ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికి విజయదశమి సందర్భంగా చేయబోయే ప్రక్షాళనలో కూడా చాలామంది సీనియర్లకు షాకులు తప్పేట్లు లేదు. మంత్రి పదవులు దక్కలేదనే అసంతృప్తి ఉన్నా చేయగలిగేది కూడా ఏమీలేదు. ఎందుకంటే రేపు నోరుజారితే ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు దక్కాలి కదా. సరే చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.