పవన్ డైరెక్టర్.. బాలీవుడ్లో గట్టిగా కొట్టాడు


విష్ణువర్ధన్ అనే డైరెక్టర్ గుర్తున్నాడా? తమిళంలో అజిత్‌తో రూపొందించిన ‘ఆరంభం’ సహా కొన్ని మంచి సినిమాలు తీశాడతను. గతంలో నవదీప్ హీరోగా కూడా తమిళంలో అతను తీసిన ఓ చిత్రం సూపర్ హిట్టయింది. చాలా స్టైలిష్‌గా, ఎంటర్టైనింగ్‌గా సినిమాలు తీస్తాడని అతడికి పేరుంది. ఈ దర్శకుడి శైలి నచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తెలుగులో ఓ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అదే.. పంజా. ఈ సినిమాపై అప్పట్లో అంచనాలు మామూలుగా లేవు.

పవన్ కళ్యాణ్ తన కెరీర్లోనే అత్యంత స్టైలిష్‌గా కనిపించిన చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమా టేకింగ్ కూడా అంతే స్టైలిష్‌గా ఉంటుంది. కానీ ‘పంజా’ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. పవన్ కెరీర్లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత విష్ణువర్ధన్ తమిళంలో ‘ఆరంభం’తో హిట్టు కొట్టాడు. తర్వాత మాత్రం అతణ్నుంచి సరైన సినిమా రాలేదు.

ఐతే ఇప్పుడు విష్ణువర్ధన్ ఓ భారీ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే.. షేర్షా. సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమిది. కార్గిల్ హీరో కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు విష్ణు. ట్రైలర్‌తో భారీ అంచనాలు రేకెత్తించిన ‘షేర్షా’ ఈ రోజే అమేజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండటంతో ఈ చిత్రంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇండియాలో వచ్చిన బెస్ట్ వార్ బేస్డ్ మూవీస్‌లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. మేజర్ విక్రమ్ బత్రా హీరోయిజాన్ని తెరమీద గొప్పగా చూపించారని, ఆ పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా అదరగొట్టేశాడని ప్రశంసలు కురుస్తున్నాయి. గత ఏడాదిన్నర వ్యవధిలో హిందీలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఓటీటీ సినిమాల్లో చాలా వరకు బోల్తా కొట్టినవే. కానీ ‘షేర్షా’ మాత్రం అంచనాలను అందుకుని హిట్ స్టేటస్ తెచ్చుకునేలా కనిపిస్తోంది. మొత్తానికి మరో సౌత్ డైరెక్టర్ బాలీవుడ్లో బలమైన ముద్ర వేసినట్లే.