‘ఆర్ఆర్ఆర్’పై వాళ్లకు ఆసక్తి లేదా?

ఇప్పుడు దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఇటీవల రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో, దోస్తీ సాంగ్ సినిమాపై అంచనాల్ని ఇంకా పెంచాయి. ‘బాహుబలి’ స్థాయి హైపే కనిపిస్తోంది ఈ చిత్రంపై. తెలుగు రాష్ట్రాల సంగతి చెప్పాల్సిన పని లేదు కానీ.. ఉత్తరాదిన కూడా ‘ఆర్ఆర్ఆర్’కు ఎక్కడ లేని క్రేజ్ కనిపిస్తుండటం విశేషమే.

తనకున్న ఫాలోయింగ్‌కు తోడు ఆలియా భట్, అజయ్ దేవగణ్ లాంటి వాళ్లకు కీలక పాత్రలు ఇవ్వడం ద్వారా రాజమౌళి ఉత్తరాది ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించాడు. కానీ దక్షిణాదిన ‘ఆర్ఆర్ఆర్’ పట్ల ఆసక్తి అనుకున్నంతగా లేదేమో అనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు సంగతే ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తోంది. ‘దోస్తీ’ తమిళ వెర్షన్‌ను కోలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తనదైన శైలిలో ఆలపించి ఈ పాటకు ఆకర్షణ తేగా.. మిగతా వెర్షన్లతో పోలిస్తే తమిళ పాటకు చాలా తక్కువగా 4 మిలియన్ వ్యూసే వచ్చాయి.

ఈ పాట విషయంలోనే కాదు.. ‘బాహుబలి’తో పోలిస్తే ‘ఆర్ఆర్ఆర్’ పట్ల ముందు నుంచి తమిళుల ఆసక్తి అంతగా కనిపించడం లేదు. ‘బాహుబలి’లో తమిళులైన సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించడగా.. ఇతర ముఖ్య పాత్రల్లో వారికి బాగా పరిచయం ఉన్న అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ చేశారు. దీంతో ఆ సినిమాకు వాళ్లు బాగా కనెక్టయ్యారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’లో సముద్రఖని మినహా తమిళులెవరూ నటిస్తున్నట్లు లేరు. సముద్రఖనికి సంబంధించి కూడా ఇప్పటిదాకా ఏ విశేషాన్నీ పంచుకోలేదు. ఒక లుక్ కూడా రిలీజ్ చేయలేదు.

‘ఆర్ఆర్ఆర్’ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు తమిళంలో ఏమంత ఫాలోయింగ్ లేదు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’కు వాళ్లు అనుకున్నంతగా కనెక్ట్ కాలేదని అర్థమవుతోంది. కన్నడిగులు ఎలాగూ ‘ఆర్ఆర్ఆర్’ను బాగానే ఆదరిస్తారు. మలయాళ మార్కెట్ చిన్నది కాబట్టి దాని గురించీ భయం లేదు కానీ.. పెద్ద మార్కెట్ అయిన తమిళనాడులో ‘ఆర్ఆర్ఆర్’ను సరైన రీతిలో ప్రమోట్ చేసి దీనికి అక్కడ క్రేజ్ పెంచడానికి జక్కన్న అండ్ కో ఏదో ఒకటి చేయాల్సిందే.