ఇండియా కొత్త కేసులు 591, ఏపీ, తెలంగాణలోను తగ్గాయి !

ఇండియాలో కరోనా కేసులు 6000 మార్కు దాటింది. కాకపోతే గత 24 గంటల్లో కొత్త కేసుల పురోగతిలో కొంచెం మందగమనం కనిపించడం ఆశావహం. కరోనా లక్షణాలు బయటపడే 14 రోజుల సమయం కూడా లాక్ డౌన్ పెట్టాక దాటేశాం. అయినా కేసుల సంఖ్య తక్కువగానే నమోదు కావడం ఆశను పెంచింది.

ఇప్పటివరకు దేశంలో లక్ష 30 వేల టెస్టులు చేయగా 6000 మందికి ఇది సోకినట్లు నిర్దారణ అయ్యింది. నిన్నటికి 700 పైగా పెరిగిన కేసులు నేడు 591 వద్ద నమోదయ్యాయి.
ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 5865 గా ఉంది. ఇది డిశ్చార్జి అయిన 478 మందితో కలిపి వేసిన సంఖ్య. మరో 169 మంది మరణించారు. మరణించిన వారితో కలుపుకుంటే ఇండియా 6 వేల మార్క్ దాటినట్టు.

ఇక తెలంగాణలో కొత్తగా 18 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.  దీంతో తెలంగాణలో కేసుల సంఖ్య 471 కి పెరిగింది. రేపటి నుంచి కొత్త కేసులు ఉండకపోవచ్చని మంత్రి ఈటల చాలా దీమాగా చెప్పారు. ఇప్పటికే తబ్లిగి కి వెళ్లొచ్చిన వారందరికీ టెస్టులు పూర్తవడం వల్ల గవర్నమెంటు కాన్ఫిడెన్సుతో ఉంది.  కొత్త మరణం ఒకటి నమోదైంది. ఈటల ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఏప్రిల్ 22 నాటికి మొత్తం అందరూ కోలుకుంటారని చెప్పారు.

ఏపీలో ఉదయం ప్రకటించిన బులిటెన్లో 217 శాంపిల్స్ చెక్ చేసినా ఒక్క కొత్త కేసు కూడా లేదని గుడ్ న్యూస్ చెప్పింది. కానీ సాయంత్రం బులిటెన్ లో కొత్తగా 15 కేసులు నమోదైనట్టు ఏపీ ప్రకటించింది. వీటిలో ప్రకాశం జిల్లాలో 11 గుంటూరులో 2, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఓవరాల్ తెలుగు రాష్ట్రాల్లో గాని, దేశంలో గాని కరోనా తీవ్రత కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. కాకపోతే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లో మాత్రం కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి.