సోము స్థానంలో రెడ్ల‌కే ప‌ట్టం.. బీజేపీ వ్యూహం ఏంటి..?


ఏపీ బీజేపీ సార‌థిని మారుస్తారా ? సోము వీర్రాజు స్థానంలో కొత్త నేత‌కు ప‌ట్టం క‌డ‌తారా? ఏపీలో బీజేపీని ప‌రుగులు పెట్టించే నాయ‌కుడి కోసం.. పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఏపీ సార‌థిగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజు ప‌గ్గాలు చేప‌ట్టి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కూడా వ‌చ్చాయి. అయితే.. ఏ ఎన్నిక‌లోనూ.. బీజేపీ పుంజుకున్న ప‌రిస్థితి లేదు. అదే స‌మ‌యంలో తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ను బీజేపీపెద్ద‌లు సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీంతో సోముకు అప్ప‌ట్లోనే టార్గెట్ విధించార‌నే చ‌ర్చ‌జ‌రిగింది.

ఈ క్ర‌మంలో మాజీ ఐఏఎస్ ర‌త్న‌ప్ర‌భ‌ను రంగంలోకి దింపారు. ఉప పోరుకు దాదాపు మూడు మాసాల ముందు నుంచి బీజేపీ నాయ‌క గ‌ణం తిరుప‌తిలో మ‌కాం వేసి.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే.. ఆ ఉప ఎన్నిక‌లో క‌నీసం మార్కులు కూడా సంపాదించలేక పోయారు. ఇక‌, స్థానికంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో సోము నాయ‌క‌త్వం.. పార్టీ భ‌విత‌పై పార్టీలో కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది. అదే స‌మయంలో సోము వీర్రాజు.. ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయ‌కుండా.. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీని టార్గెట్ చేయ‌డం వ‌ల్ల‌.. అప్ప‌టి వ‌రకు క్ష‌త్రియ‌, క‌మ్మ సామాజిక వ‌ర్గాల్లో బీజేపీపై ఉన్న సానుభూతి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింద‌నే వాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది.

ఈ క్ర‌మంలో పోనీ.. సోము త‌న సొంత సామాజిక వ‌ర్గాన్న‌యినా.. బీజేపీవైపు మ‌ళ్లించారా ? ఈ విష‌యంలో అయినా స‌క్సెస్ అయ్యారా ? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో రాష్ట్ర స్థాయిఉద్య‌మం పిలుపు ఇచ్చినా.. నాయ‌కుల‌ను ముందుండి న‌డిపించ‌డంలోను..బ ల‌మైన వైసీపీకి చెక్ పెట్టేలా వ్యూహాల‌ను అమ‌లు చేయ‌డంలోనూ బీజేపీ చ‌తికిల ప‌డింద‌నే వాద‌న ఉంది. ఇక‌, సోము ఏ నినాదం అందుకున్నా.. ఆయ‌న‌ను అనుస‌రించేవారు కూడా ఇటీవ‌ల కాలంలో త‌గ్గిపోయారు. దీంతో ఇక‌, సోమును ప‌క్క‌న పెట్ట‌డం త‌ప్ప బీజేపీ అధిష్టానం ముందు మ‌రో ప్ర‌త్యామ్నాయం లేకుండా పోయింది.

దీంతో మ‌రో ఆరేడుమాసాల్లోనే సోమును ప‌క్క‌న పెట్టి.. కీల‌క నేత‌కు ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని బీజేపీ పెద్ద‌లు ఆలోచన చేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి , ఆ త‌ర్వాత‌. .. రెండు సార్లు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లకు బీజేపీ అధిష్టానం ఏపీలో ప‌గ్గాలు అప్ప‌గించింది. అయితే.. క‌మ్మ నేత కంభంపాటి హ‌రిబాబు.. పార్టీ చీఫ్‌గా ఉన్న స‌మ‌యంలో ఒకింత మెరుగైన ఫ‌లితాలే సాధించారు. కానీ, కాపు నాయ‌క‌త్వం తెర‌మీదికి రావ‌డంతో అంటే.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ, సోము వీర్రాజుల‌కు ప‌గ్గాలు అప్ప‌గించాక‌.. క‌మ్మ నేత‌లు పార్టీకి దూర‌మ‌య్యారు.

మ‌రీ ముఖ్యంగా సోము ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. క‌మ్మ‌లు బీజేపీని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, రెడ్డి సామాజిక వ‌ర్గం అంటీముట్ట‌న‌ట్టు ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇస్తే త‌ప్ప‌.. త‌మ ప్ర‌భుత్వ ఏర్పాటు సాధ్యం కాద‌ని భావిస్తున్న బీజేపీ త్వ‌ర‌లోనే రాష్ట్ర పార్టీ ప‌గ్గాలను రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు అప్ప‌గించే వ్యూహంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందులోనూ ప్రాంతీయ భావ‌న‌కు పెద్ద‌పీట వేస్తార‌ని తెలుస్తోంది.

గ‌తంలో ఉత్త‌రాంధ్ర‌కు చెందిన హ‌రిబాబుకు అవకాశం ఇచ్చారు. త‌ర్వాత గుంటూరుకు, ఆ త‌ర్వాత‌.. తూర్పుగోదావ‌రి నేత‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఛాన్స్ ఇస్తూనే.. క‌డ‌ప జిల్లాకు ప్రాముఖ్యం ఇవ్వాల‌ని.. ఇక్క‌డి నేత‌లు.. ఆదినారాయ‌ణ‌రెడ్డి, విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి వంటివారికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.