కేసీఆర్ కు షాకిస్తున్న.. ‘తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి’

దానకర్ణుడు సైతం చేయలేని రీతిలో వినూత్న సంక్షేమ పథకాల్ని తీసుకొస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. రైతుబంధు పేరుతో.. పదుల సంఖ్యలో భూములు ఉన్న వారికి సైతం సాయాన్ని అందించిన ఆయన.. తాజాగా దేశంలో మరెవరికీ రాని అద్భుతమైన ఆలోచన చేయటం తెలిసిందే. ‘తెలంగాణ దళితబంధు’ పేరుతో ఆయన చెబుతున్న కాన్సెప్టు వింటున్న వారికి మైండ్ బ్లాక్ అయిపోతోంది.

సామాజికంగా వెనుకబడి.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి.. వారి బ్యాంకు అకౌంట్లోకి ఏకాఏకిన రూ.10లక్షల మొత్తాన్ని వేసేయటం.. ఆ మొత్తాన్ని వారికి తోచినట్లుగా మంచిగా వాడుకునే అవకాశాన్ని ఇవ్వటం చూస్తే.. రూ.10లక్షల క్యాష్ బ్యాంకు ఖాతాలో ఉండే భాగ్యాన్ని కల్పిస్తున్నారని చెప్పాలి. మరింత అద్భుతమైన ఆలోచనలు చేసే కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ‘నియామకాల’ విషయంలో మాత్రం అంతులేని జాగు ఎందుకు చేస్తున్నట్లు? అన్నది ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగం లేని ఒక యువకుడు వినూత్నంగా ఆలోచించాడు.

‘తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి’ పేరుతో ఒక బండిని ఏర్పాటు చేశారు. బండి నెత్తిన పెద్ద బోర్డును పెట్టేసి.. తన పరిస్థితి గురించి చెప్పకనే చెప్పేయటమే కాదు.. చదువుకున్న యువకులకు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని తన చేతలతో చెప్పేశాడు. ఇంతకీ ఈ మిర్చి బండి ఎక్కడ ఉంది? దాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? అతగాడు ఆ పేరుతో మిర్చి బండి ఎందుకు పెట్టినట్లు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంతకీ ఈ వినూత్నమైన ఐడియా.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన నర్సింహది. అతగాడు ఐటీఐ చేసిన తర్వాత డిగ్రీ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. కానీ.. ఫలితం రాలేదు. దీంతో నిరాశకు గురి కాకుండా.. నిరుద్యోగిగా నిలిచిపోకుండా.. సొంతంగా ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఏడాది క్రితం స్థానిక ముకరంపురలో.. ‘తెలంగాణ నిరుద్యోగి మిర్చిబండి’ని ఏర్పాటు చేసుకున్నాడు.

తన ఉపాధి కోసం మొదలు పెట్టిన ఈ బజ్జి బండికి పేరు రావటంతో మరో ఇద్దరికి కొలువు ఇవ్వటమే కాదు.. వారికి రోజుకు రూ.400 ఇస్తున్నట్లు చెబుతున్నాడు. అంతేకాదు..ఖర్చులు పోను రోజుకు రూ.1500 వరకు సంపాదిస్తున్నట్లు చెబుతున్నాడు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు బండిని నిర్వహిస్తున్న ఇతగాడు.. నిరుద్యోగిగా మిగిలిపోకుండా ఉండటమే కాదు..తన వెరైటీ పేరుతో అందరి చూపు తన మీద పడేలా చేయటమే కాదు.. మిర్చి బండి పేరుతో ఏకంగా ప్రభుత్వానికే చురుకు పుట్టిస్తున్నాడని చెప్పాలి.