కరోనా 3.0 బెల్ మోగిందా!

కరోనా వైరస్ థర్డ్ వేవ్ దేశంలో డేంజర్ బెల్స్ మొగించబోతోందంటు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు తీవ్రమైన హెచ్చరికలు జారీచేశారు. ఈనెలలలోనే థర్డ్ వేవ్ తీవ్రత మొదలై అక్టోబర్ చివరవరకు కంటిన్యు అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చరిత్ర ప్రకారం చూస్తే రోజుకు లక్షకు తక్కువ కాకుండా కేసులు నమోదయ్యే ప్రమాదముందున్నారు. పరిస్ధితులు దిగజారిపోతే ఈ సంఖ్య లక్షన్నర మించిపోయే అవకాశం కూడా ఉందంటున్నారు.

సెకండ్ వేవ్ మొదలైన మార్చిలో జనాల నిర్లక్ష్యం కారణంగానే సమస్య తీవ్రత పెరిగిపోయిందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో రోజుకు 4 లక్షల కేసులు నమోదవ్వటం, వేలసంఖ్యలో మరణాలను ప్రస్తావిస్తున్నారు. సామాజిక, వ్యాపార కార్యకలాపాలను ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండా చేసేటం, కనీసం మాస్కు కూడా ధరించకపోవటం లాంటి నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్ అంతటి తీవ్రమైన ప్రభావాన్ని చూపినట్లు నిపుణులు చెబుతున్నారు.

జనాల్లో నిర్లక్ష్యం పెరిగిన కొద్దీ వైరస్ తీవ్రత కూడా బాగా పెరిగిపోయిందన్నారు. దీని కారణంగానే రోగులకు ఆక్సిజన్ అవసరాలు పెరిగిపోయి మరణాలు కూడా ఎక్కువగా సంభవించినట్లు చెప్పారు. సెకండ్ వేవ్ తో పోల్చుకుంటే థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగానే ఉండచ్చని అంచనా వేశారు. అయితే నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ప్రాణాలమీదకు రాకమానదని కూడా హెచ్చరిస్తున్నారు. అతిధిలను ఆహ్వానించినట్లు ఆహ్వానిస్తేనే కరోనా వైరస్ మనింట్లోకి ప్రవేశిస్తోందని డాక్టర్లు, శాస్త్రవేత్తలు చమత్కరిస్తున్నారు.

థర్డ్ వేవ్ తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా హెచ్చరిస్తున్నారు. అందరికీ టీకాలు వేయించటం ప్రధమంగా చేయాలన్నారు. అలాగే సెకండ్ వేవ్ ఆధారంగా హాట్ స్పాట్ తో పాటు సూపర్ స్ప్రెడర్లను గుర్తించి నియంత్రించాలన్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే థర్డ్ వేవ్ లో కూడా సెకండ్ వేవ్ లాంటి తీవ్రతే రిపీట్ అవుతుందన్నారు. ప్రపంచంలోని సుమారు 140 దేశాల్లో పెరిగిపోతున్న డెల్టా వేరియంట్ వైరస్ విజృంభించకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు జనాలు కూడా నూరుశాతం సహకారం అందిస్తేనే వైరస్ నియంత్రణలో ఉంటుందన్నారు.