‘ఆర్ఆర్ఆర్’కు ముందనుకన్న కాంబినేషన్లేవి?

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే మామూలుగానే అంచనాలు ఎక్కువ. పైగా ‘బాహుబలి’ తర్వాత ఆయన తీస్తున్న చిత్రమిది. అందులోనూ టాలీవుడ్లో ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్లు కలిసి చేస్తున్న సినిమా కావడంతో హైప్ మరో స్థాయికి చేరుకుంది.

ఐతే నిజానికి రాజమౌళి ఈ కథకు ముందు అనుకున్న కాంబినేషన్ ఇది కాదట. వేరే కొన్ని కాంబినేషన్లు అనుకుని చివరికి తారక్-చరణ్‌లతో జక్కన్న ఈ సినిమా చేశాడట. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ కథకుడు విజయేంద్ర ప్రసాదే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ కథకు ఎలా బీజం పడిందో.. ఆ కథ ఎలా రూపుదిద్దుకుందో కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

‘‘ఇద్దరు హీరోలతో ఒక పెద్ద కమర్షియల్ చిత్రం చేయాలని రాజమౌళి అనుకున్నాడు. రజనీకాంత్‌-ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌-ఎన్టీఆర్‌, కార్తి-సూర్య, కార్తి-బన్నీ.. ఇలా రకరకాల కాంబినేషన్‌ల గురించి ఆలోచించాడు. చివరికి తారక్-చరణ్‌లతో ఈ సినిమా చేశాడు. ఐతే కాంబినేషన్ గురించి ఆలోచిస్తున్నపుడే ఓసారి రాజమౌళి ఆసక్తికర విషయం చెప్పాడు.

అల్లూరి సీతారామరాజు పోరాటయోధుడిగా మారడానికి ముందు కళాశాల చదువు పూర్తి చేసుకుని ఓ రెండేళ్లపాటు ఎక్కడికో వెళ్లిపోయారు. అక్కడి నుంచి వచ్చాకే ఆయన ఆంగ్లేయులపై పోరాటం చేశారు. అయితే ఆయన ఎక్కడికి వెళ్లారు? ఆ రెండేళ్లు ఎక్కడ ఉన్నారు? అనే విషయంపై ఎక్కడా కూడా సరైన సమాచారం లేదు. మరోవైపు అల్లూరి వెళ్లిన సమయంలోనే కొమరం భీమ్‌ కూడా కొంతకాలం పాటు తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కడికో వెళ్లారు. అక్కడి నుంచి వచ్చాకే ఆయన మనందరికీ తెలిసిన కొమరం భీమ్‌గా మారారు. ఈ విషయాన్ని చెప్పి.. ‘నాన్నా.. వీళ్లిద్దరూ ఒకే సమయంలో కొంతకాలంపాటు కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. ఒకవేళ వాళ్లిద్దరే కనుక పరస్పరం తారసపడితే ఎట్లా ఉంటుంది?’ అని అడిగాడు. అలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కథ ప్రారంభమైంది. తర్వాత దాన్ని డెవలప్ చేశాం’’ అని విజయేంద్రప్రసాద్‌ వివరించారు.