టాలీవుడ్ దెబ్బకు శంకర్ మారిపోయాడు

కోలీవుడ్ చరిత్రలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో శంకర్ ఒకడు. తమిళ సినిమాను ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత అతడిది. తొలి సినిమా ‘జెంటిల్‌మేన్’తో మొదలుపెడితే.. ఆయన్నుంచి ఎన్నో బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఆయన సినిమాల్లో భారీతనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ భారీతనం స్క్రిప్టు దశ నుంచే మొదలవుతుంది. బాగా టైం తీసుకుని స్క్రిప్టు తయారు చేయడం.. ప్రి ప్రొడక్షన్‌ పనులు కూడా సుదీర్ఘంగా చేయడం శంకర్‌కు అలవాటు.

ఇక మేకింగ్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా స్క్రిప్టు దశ నుంచి మొదలుపెడితే.. రిలీజయ్యే సరికి దాదాపు మూడేళ్లు పడుతుంది. కొన్ని సినిమాలను మాత్రం రెండేళ్లలో పూర్తి చేశాడు. ‘3 ఇడియట్స్’ రీమేక్ ఒక్కటి ఇందుకు మినహాయింపు. శంకర్ చివరగా మొదలుపెట్టిన ‘ఇండియన్-2’ను పూర్తి చేయడానికి కూడా శంకర్‌కు చాలా టైమే పడుతోంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు మధ్యలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.

ఐతే ఇప్పుడు ఆ చిత్రాన్ని పక్కన పెట్టి శంకర్.. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఇక్కడి అగ్ర నిర్మాత దిల్ రాజుల కలయికలో ఓ సినిమా మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ టైంలో దొరికి బ్రేక్‌లో ఈ సినిమాకు వేగంగా స్క్రిప్టు సిద్ధం చేసిన శంకర్.. ప్రి ప్రొడక్షన్ కోసం కూడా ఎక్కువ టైం తీసుకోలేదు. చకచకా షూటింగ్‌కు సన్నాహాలు పూర్తి చేశాడు. తాజాగా కియారా అద్వానీని ఈ సినిమాకు కథానాయికగా ఖరారు చేశారు.

తమన్‌ సంగీత దర్శకుడిగా ఓకే అయ్యాడు. అతను ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టేశాడు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. శంకర్ కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా ఆరు నెలల వ్యవధిలో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించారట. మొత్తంగా సినిమా గురించి ప్రకటన వచ్చిన దగ్గర్నుంచి ఏడాదిలోపే ఈ సినిమా పూర్తి కానుంది. కోలీవుడ్లో బాగా తీరికగా సినిమాలు చేసే శంకర్.. టాలీవుడ్లో చేస్తున్న తొలి సినిమాకు ఇంత స్పీడ్ చూపించడం ఆశ్చర్యమే. వచ్చే వేసవి లేదా.. ఏడాది మధ్యలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.