వెంకీ చెప్పేశాడు.. సంక్రాంతికే అని

వచ్చే సంక్రాంతికి సినిమాల మోత మామూలుగా ఉండేలా లేదు. ఒకదాని తర్వాత ఒకటి భారీ చిత్రాలు సంక్రాంతి పందేనికి రెడీ అయిపోతున్నాయి. ఆ పండక్కి ముందుగా మహేష్ బాబు చిత్రం ‘సర్కారు వారి పాట’ రిలీజ్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్‌కు ముందు ఈ చిత్రానికి డేట్ ఇచ్చారు. కరోనా వల్ల షూటింగ్‌కు బ్రేక్ పడ్డప్పటికీ చిత్ర బృందం వెనక్కి తగ్గలేదు. షెడ్యూళ్లు అడ్జస్ట్ చేసుకుని సంక్రాంతికే తమ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే పట్టుదలతో అడుగులు వేస్తున్నారు.

దీనికి పోటీగా రావాల్సిన ‘హరి హర వీరమల్లు’ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ.. పవన్ నటిస్తున్న మరో చిత్రం సంక్రాంతి రేసులోకి వచ్చింది. రానాతో కలిసి ఆయన చేస్తున్న ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతలో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘రాధేశ్యామ్’ హఠాత్తుగా పండుగ రేసులోకి వచ్చింది. 2022 జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేయడం తెలిసిందే. ఐతే ముగ్గురు సూపర్ స్టార్లు నటించిన భారీ చిత్రాలకు అసలక్కడ స్పేస్ ఉందా అనుకుంటుంటే.. సంక్రాంతి రేసులోకి నాలుగో చిత్రం కూడా వచ్చేసింది. .

పై మూడు చిత్రాల రేంజ్ కాకపోయినా అది కూడా క్రేజీ మూవీనే. విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ కలయికలో తెరకెక్కుతున్న బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఎఫ్-2’ సీక్వెల్ ‘ఎఫ్-3’ కూడా సంక్రాంతికే రానున్న విషయం ఖరారైంది. ‘నారప్ప’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ స్వయంగా వెంకీనే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. వచ్చే సంక్రాంతికి ‘ఎఫ్-3’ నవ్వులు పండిస్తామని ఆయన చెప్పాడు.
ఐతే రెండు పెద్ద సినిమాలు వస్తేనే థియేటర్ల సర్దుబాటు చాలా కష్టమవుతుంది. అలాంటిది నాలుగు సినిమాలను ఎలా అకామొడేట్ చేస్తారన్నది అర్థం కాని విషయం. కనీసం ఇందులోంచి ఒక్క చిత్రమైనా రేసులోంచి తప్పుకోకుండా చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం ఖాయం.