పెగాసస్ పై బీజేపీ ఇరుక్కున్నట్లేనా ?

పార్లమెంటులో జరిగిన తాజా పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాల నేతలు, దేశంలోని ప్రముఖులు, జర్నలిస్టులు ఇలా సుమారు లక్షమంది మొబైల్ ఫోన్లను పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణల సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయమై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవటంతో పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి.

పార్లమెంటులో చర్చకు అనుమతించాలని లేదా ప్రధానమంత్రి నరేంద్రమోడి తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ప్రతిపక్ష నేతల డిమాండ్ కు మోడి అస్సులు నోరే విప్పటంలేదు. ఈ నేపధ్యంలోనే అసలు విషయంపై ఉన్నతాధికారులతో చర్చించేందుకు పార్లమెంటు స్టాండింగ్ కమిటి పార్లమెంటులో బుధవారం సమావేశమైంది. అయితే ఈ సమావేశం జరగకుండా బీజేపీ ఎంపిలు అడ్డుకున్నారు.

అసలు కేంద్రప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిందా లేదా అనే అంశంపై ఉన్నతాధికారుల వెర్షన్ తెలుసుకునేందుకు స్టాండింగ్ కమిటి సమావేశమైంది. కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ మెజారిటి సభ్యులు మాత్రం బీజేపీ ఎంపిలే. సమావేశానికి శశిథరూర్ , ఇతర పార్టీల సభ్యులు హాజరైనట్లే బీజేపీ ఎంపిలు కూడా హాజరయ్యారు. అయితే సమావేశంలో ఉన్నతాధికారులను నోరెత్తనీయకుండా బీజేపీ ఎంపిలు అడ్డుకున్నారు. అసలు సమావేశం మొదలైన తర్వాత మినిట్స్ బుక్ లో సంతకాలు పెట్టడానికే నిరాకరించారు.

మినిట్స్ బుక్ లో సభ్యులు సంతకాలు పెట్టకపోతే సమావేశం జరిపేందుకు లేదు. ఈ విషయం తెలుసుకునే బుక్ లో బీజేపీ ఎంపిలు సంతకాలు పెట్టలేదు. దాంతో సభ్యుల మధ్య ఎంతసేపు చర్చలు జరిగినా ఉపయోగం లేకపోవటంతో సమావేశాన్ని ముగించేశారు. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ ఎంపిలు సమావేశాన్ని అడ్డుకున్న విషయం అర్ధమైపోతోంది. బీజేపీ ఎంపిల చర్యతో పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కేంద్రం కొనుగోలు చేసిందని, అనుమానితులందరి మొబైళ్ళను ట్యాపింగ్ చేయించిందని అర్ధమైపోయింది. విచిత్రమేమిటంటే ట్యాపింగ్ అయిన ఫోన్లలో కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీల ఫోన్లు కూడా ఉండటమే.