రామోజీరావుకి మరో బాహుబలి అవుతుందా..?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ సినిమాతో లాభ పడింది నిర్మాతలు మాత్రమే కాదు.. చాలా మంది ఉన్నారు. వారిలో ప్రముఖ నిర్మాత రామోజీరావు కూడా ఉన్నారు. ‘బాహుబలి’ సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది.

గ్రాండియర్ లుక్ కోసం రాజమౌళి భారీ భారీ సెట్లను నిర్వహించారు. షూటింగ్ అయిపోయిన తరువాత టూరిస్ట్ ల కోసం ఆ సెట్స్ ను అలానే ఉంచేశారు. ఈ సినిమాలో రామోజీరావు కూడా పెట్టుబడులు పెట్టారని టాక్. లాభాల్లో ఆయనకు కూడా వాటా దక్కిందని చెబుతుంటారు.

సినిమా అంతా కూడా ఫిల్మ్ సిటీలోనే కాబట్టి.. రామోజీరావుకు బాగానే గిట్టుబాటు అయింది. దానికి తగ్గట్లుగానే రామోజీ తన ఛానెల్ లో ‘బాహుబలి’ సినిమాకి భారీ ప్రచారం కల్పించారు. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ మరొకటి రామోజీరావుకి దక్కింది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ‘ప్రాజెక్ట్ కె’ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాగాశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే నిర్వహించనున్నారు. కొన్ని సన్నివేశాలు మాత్రం విదేశాల్లో తెరకెక్కించనున్నారు. దాదాపు తొంబై శాతం షూటింగ్ ఫిల్మ్ సిటీలోనే జరపనున్నారు.ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ మొత్తం ఫిల్మ్ సిటీలోనే వేయబోతున్నారు. యాభై శాతం సన్నివేశాలు సెట్ లో.. మిగిలిన పార్ట్ ను బ్లూ మ్యాట్ లో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను 2023లో విడుదల చేయనున్నారు.