ఎంఐఎంకు అంత సీనుందా ?

తనను తాను ఎంఐఎం పార్టీ చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్లుంది. వచ్చే ఏడాది మొదట్లోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపు ఇటు సమాజ్ వాది పార్టీ (ఎస్పీ) అటు బహుజన్ సమాజ్ వాదిపార్టీ (బీఎస్పీ)లకు చాలా కీలకంగా మారింది. ఇందుకనే చిన్నా చితకా పార్టీలతో పోటీపడితే ఓట్లు చీలోతాయనే టెన్షన్ పై రెండుపార్టీల్లో పెరిగిపోతోంది. దీన్ని చిన్నాపర్టీలు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి.

ఎస్పీ నేతలతో పొత్తు చర్చలు జరిపిన ఎంఐఎం నేతలు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవినే బేరానికి పెట్టారు. రాబోయే ఎన్నికల్లో ఎస్పీ గనుక అధికారంలోకి వస్తే తమ పార్టీకి డిప్యుటీ సీఎం పదవిని ఇవ్వాల్సిందే అని గట్టిగా చెప్పటం విశేషం. ఎంఐఎం డిమాండ్ చేయటాన్ని పక్కనపెట్టేస్తే అసలు ఆ పార్టీకి యూపీలో అంత సీనుందా అనేదే అందరిలోను సందేహాలు పెరిగిపోతున్నాయి.

దశాబ్దాల పాటు హైదరాబాద్ లోని పాతబస్తీకి మాత్రమే పరిమితమైన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని ఎంపి, జాతీయ అద్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, బీహార్ లో కాస్త సక్సెస్ అయ్యారంతే. కాకపోతే ఇతర పార్టీలకు ముస్లిం ఓట్లు వెళ్ళకుండా చీల్చుకున్నారు. ముస్లిం ఓట్లే ఎంఐఎంకి ఆయువుపట్టు.

తొందరలో జరగబోయే యూపీ ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయాలని ఇప్పటికే అసదుద్దీన్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే యూపిలో గట్టి అభ్యర్ధుల కోసం రెండుసార్లు టూర్ కూడా చేశారు. తాము పోటీ చేయాలని అనుకున్న నియోజకవర్గాలన్నీ ముస్లిం ప్రాబల్యమున్నవే కావటం గమనార్హం. దశాబ్దాలుగా ఎస్పీ కూడా యాదవ్+ముస్లిం ఓట్లపైనే ఆధారపడుతున్నది. అందుకనే ఇపుడు ఎస్పీతో పొత్తులు పెట్టుకుని లాభపడాలని అనుకుంటున్నది.

ఈ విషయాన్ని గ్రహించిన ఎస్పీ నేతలు కూడా పొత్తులకు ఓకే చెప్పారు. అయితే అనూహ్యంగా తమకు డిప్యుటి సీఎం పదవి కావాలని డిమాండ్ చేసేటప్పటికి ఎస్పీ నేతలు ఆశ్చర్యపోయారట. ఇదే విషయాన్ని పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో చెప్పినట్లు సమాచారం. పొత్తుల విషయాన్ని డిసైడ్ చేయటానికి తొందరలోనే అసద్ యూపిలో పర్యటించబోతున్నారు. పనిలో పనిగా అఖిలేష్ తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు పొత్తులపై క్లారిటి వస్తుందట. చూద్దాం ఎంఐఎం డిమాండ్ పై అఖిలేష్ ఏ విధంగా స్పందిస్తారో.