అనీల్ రావిపూడికి వెయిటింగ్ తప్పదా..?

ఈ జనరేషన్ యంగ్ హీరోలకంటే బిజీగా ఉన్నారు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. వరుస సినిమాలు ఒప్పుకుంటూ అడ్వాన్స్ లు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు అరడజను ప్రాజెక్ట్ లు ఆయన చేతిలో ఉన్నాయి. అవి కాకుండా మరో నలుగురైదుగురు నిర్మాతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ముందుగా తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు బాలయ్య. ‘అఖండ’ సినిమా పూర్తవ్వగానే.. గోపీచంద్ మలినేని సినిమాను పట్టాలెక్కిస్తారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడితో సినిమా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు బాలయ్య ఆలోచన మారినట్లు సమాచారం. గోపీచంద్ సినిమా తరువాత పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలనుకుంటున్నారట. గతంలో వీరిద్దరూ కలిసి ‘పైసా వసూల్’ సినిమా చేశారు. అప్పటినుండి మరో సినిమా చేద్దామని అనుకుంటూనే ఉన్నారు. కానీ కుదరడం లేదు.

ఇప్పుడు పూరితో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూరితో సినిమా చేస్తున్నా అంటూ బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి పూరితో సినిమాకి మరికొంత సమయం పడుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అతడి కోసం అనిల్ రావిపూడిని పక్కన పెడుతున్నారు బాలయ్య. అనిల్ చెప్పిన కథలో బాలయ్య చెప్పిన మార్పులు చేయడానికి సమయం పడుతుంది. పూరి కథల విషయంలో చాలా ఫాస్ట్ గా ఉంటారు. ఆయన దగ్గర ఆల్రెడీ బాలయ్యకి సూటయ్యే రెండు, మూడు లైన్లు రెడీగా ఉన్నాయి. అందుకే ముందుగా పూరితో సినిమా పూర్తి చేయనున్నారు. 2022లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.