వైసీపీలో మ‌ళ్లీ ప‌ద‌వుల పండ‌గ ముహూర్తం 30నే!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ప‌ద‌వుల పండగ జోరుగా సాగుతోంది. ఇప్ప‌టికే నామినేటెడ్ ప‌ద‌వులు పంచిన ప్ర‌భుత్వం.. ఇప్పుడు.. తాజాగా స్థానిక సంస్థ‌ల‌కు సంబంధించిన ప‌ద‌వుల‌ను పంచేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ కూడా జారీ చేసింది. దీని ప్ర‌కారం.. ఈ నెల 30న ప‌ద‌వుల పంప‌కానికి రంగం సిద్ధ‌మైంది. 11 మున్సిపల్‌ కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం ఎస్‌ఈసీ ప్రకటన జారీ చేసింది. 75 మున్సిపాలిటీలు / నగర పంచాయతీల్లో రెండో వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక చేప‌ట్ట‌నున్నారు.

వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌రకు అంటే.. రాష్ట్ర చ‌రిత్ర‌లో మునిసిపాటిల్లో ఒక మేయ‌ర్‌, ఒక డిప్యూటీ మేయ‌ర్‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంది. అయితే.. వైసీపీ స‌ర్కారు అంద‌రికీ న్యాయం చేయాల‌నే ఉద్దేశంతో.. నేత‌ల అభిమ‌తాల‌కు అనుగుణంగా.. అడుగులు వేసింది. ఈ క్ర‌మంలోనే పంచాయ‌తీ రాజ్ చ‌ట్టానికి సైతం మార్పులు చేస్తూ.. కొత్త జీవో తీసుకువ‌చ్చి.. ఎన్నిక‌ల స‌మ‌యంలోను.. పార్టీలోనూ.. కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వారిని స‌ముచితంగా గౌర‌వించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ నేప‌థ్యంలో.. రెండో డిప్యూటీ మేయ‌ర్‌ను నియ‌మించాల‌ని భావించింది.

ఈ క్ర‌మంలో నేతల ఎన్నిక కోసం ఈనెల 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. పురపాలికల్లో రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక చేప‌ట్టనున్నారు. కార్పొరేషన్లలో రెండో డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రెండో వైస్‌ ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు.. ఎస్ఈసీఈ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఈ ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

రెండో డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఈ నెల 30 తేదీన పురపాలికల్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 25న ఓట్లు లెక్కించే ఏలూరు నగరపాలక సంస్థకూ ఇవే ఆదేశాలు వర్తిస్తాయి. కాగా, మొత్తంగా భారీ సంఖ్య‌లో వైసీపీ నేత‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. వీరంతా కూడా పార్టీకి పూర్తి విధేయులుగా ఉండడంతోపాటు.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో పార్టీ కోసం కృషి చేశారు. వీరికి ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా..పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌నేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో అసంతృప్తులు త‌గ్గించేందుకు ఇది వ్యూహాత్మ‌కంగా ప‌నిచేస్తుంద‌ని నేత‌లు భావిస్తున్నారు.