ముంబై వర్షాలు.. నటుడికి రూ.25 లక్షల నష్టం!

దేశంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రం వర్షాల దాటికి వణికిపోతుంది. గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునగగా.. ఎంతోమంది నిరాశ్రయులు అవుతున్నారు. ఆర్ధిక, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ క్రమంలో తనకు కూడా వర్షాల కారణంగా భారీ నష్టం జరిగిందని చెబుతున్నారు నటుడు కుశాల్ టాండన్. హిందీ సీరియల్స్ తో బాగా ఫేమస్ అయిన ఈ నటుడు 2019లో ‘ఆర్బర్ 28’ అనే పేరుతో రెస్టారెంట్ మొదలుపెట్టారు.

దీని ప్రారంభోత్సవ వేడుకకు హార్దిక్ పాండ్య, సిద్ధార్థ్ శుక్ల, సోహైల్ ఖాన్ లాంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే కొన్నిరోజుల పాటు వ్యాపారం బాగానే కొనసాగింది. కానీ కరోనా కారణంగా రెస్టారెంట్ ను మూసేయాల్సిన పరిస్థితి కలిగింది. లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుండగా.. ఇప్పుడేమో వర్షాల దాటికి అతడి రెస్టారెంట్ ధ్వంసమైంది. ఈ విషయం గురించి కుశాల్ స్వయంగా చెప్పారు.

కోవిడ్ కారణంగా వ్యాపారం దెబ్బతిందని.. రెండు సార్లు రెస్టారెంట్ ను క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా రెస్టారెంట్ లను తెరిచినప్పటికీ కస్టమర్లు మాత్రం వచ్చేవారు కాదని.. ఇప్పుడేమో భారీ వర్షాల కారణంగా రెస్టారెంట్ కి డ్యామేజ్ జరిగిందని.. పాతిక లక్షల వరకు నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిసిన సమయంలో వాచ్ మెన్, గార్డులు అక్కడ లేకపోవడం మంచిదైందని చెప్పుకొచ్చారు.