కేసీయార్, ఈటలకు షాక్ తప్పదా ?

అవును ఇద్దరికీ కేంద్ర ఎన్నికల కమీషన్ ఒకేసరి షాక్ ఇవ్వబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేట్లుగా లేదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకెండ్ ప్రభావం ఇప్పట్లో తగ్గేట్లు కనబడటంలేదు. తెలంగాణా మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తాజాగా మాట్లాడుతూ కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రబావం అక్టోబర్ వరకు ఉంటుందని చెప్పారు. జనాలంతా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళుండాలని కూడా ఆయన హెచ్చరిచటం గమనార్హం.

ఇదే సమయంలో కరోనా వైరస్ మూడో వేవ్ విషయంలో దేశంలోని జనాలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్రప్రభుత్వం కూడా పదే పదే ప్రకటిస్తోంది. కర్నాటక, కేరళ, మహారాష్ట్రలో థర్డ్ వేవ్ మొదలైపోయిందనే టెన్షన్ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా సోమవారం కరోనా వైరస్ కారణంగా 370 మంది చనిపోగా మంగళవారం ఆ సంఖ్య ఒక్కసారిగా 3500కి పెరిగిపోవటంతో కేంద్రం ఆందోళన వ్యక్తంచేస్తోంది.

సో, జరుగుతున్నది చూస్తుంటే తెలంగాణాలో కూడా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ను ఎత్తేసిన రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మళ్ళీ పెరిగిపోతోంది. ఎందుకంటే లాక్ డౌన్ ఎలాగూ లేదుకాబట్టి జనాలు విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ఈ పరిస్ధితికి హుజూరాబాద్ కూడా మినహాయింపేమీ కాదు. అందుకనే హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశాలు కనబడటంలేదు. గతంలో సెప్టెంబర్లోనే ఉపఎన్నిక జరగబోతోందంటు ఓ ప్రచారం జరిగింది.

దాని ప్రకారం కేసీయార్, ఈటల ఇద్దరూ రంగంలోకి దిగేశారు. టీఆర్ఎస్, బీజేపీలు పోటాపోటీగా నియోజకవర్గంలో మండల కమిటిలను ప్రకటించేసి బాధ్యతలను కూడా అప్పగించేశాయి. ఈటలైతే ప్రజా జీవన పేరుతో పాదయాత్ర కూడా మొదలుపెట్టేశారు. కేసీయార్ కూడా యుద్ధప్రాతిపదికన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఏడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రజాక్టుగా హుజూరాబాద్ లో మొదలుపెట్టేస్తున్నారు.

ఇటు కేసీయార్ అటు ఈటల చాలా ఆగ్రెసివ్ గా రంగంలోకి దిగేసిన తర్వాత ఉపఎన్నిక ఇఫ్పుడిప్పుడే జరిగే సూచనలు అందటం నిజంగా షాకిచ్చేదే. ఇప్పటివరకు పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరుచందంగా మారిపోతుంది. దేశవ్యాప్తంగా 17 అసెంబ్లీ+2 లోక్ సభ స్ధానాల్లో ఉపఎన్నికలు జరగాలి. ఇందులో ఒక్కటి కూడా బీజేపీ గెలిచితీరాల్సిందే అన్న నియోజకవర్గం లేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా ప్రశాంతంగానే ఉంది. అందుకనే ఇప్పట్లో అంటే కనీసం మరో మూడు నెలల వరకు ఉపఎన్నికలు జరిగే అవకాశాలు లేవని తాజా సమాచారం. మరి కేసీయార్, ఈటల ఏమి చేస్తారో చూడాలి.