మైక్రోసాఫ్ట్ సంచ‌ల‌న నిర్ణ‌యం… హైద‌రాబాద్‌కు ఆ రికార్డ్ సొంతం

గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైద‌రాబాద్ కు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధ‌మైంది. హైదరాబాద్‌లో మరో భారీ పెట్టుబడికి మైక్రోసాఫ్ట్ రెడీ అయిన‌ట్లు సమాచారం. నగరం సమీపంలో రూ.15 వేల కోట్లతో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మై ఈ మేరకు తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్టు స‌మాచారం. చర్చలు తుది దశకు చేరాయని, భూమి కేటాయింపుపై స్పష్టత వచ్చాక ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రభుత్వం సూచించిన స్థలంపై మైక్రోసాఫ్ట్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

తమ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీస్‌ ‘అజూర్‌ క్లౌడ్‌’ను జియో నెట్‌వర్క్‌పై మైక్రోసాఫ్ట్‌ అందిస్తోంది. క్లౌడ్‌ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వైపు కదలాలని చూస్తున్న చిన్న వ్యాపారాలే దీని లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే జియోతో కలిసి మైక్రోసాఫ్ట్‌ దేశంలో క్లౌడ్‌ డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అదనంగానే ఇప్పుడు డాటా సెంటర్లను మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది.

‘ఐటీ రంగంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం.. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్‌ సంస్థ హైదరాబాద్‌లో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చు’ అని అధికార‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే ‘అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌’ హైదరాబాద్‌లో రూ.20 వేల కోట్లతో డాటా సెంటర్‌ను శంషాబాద్ స‌మీపంలోని హైతాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. డాటా సెంటర్స్‌ విభాగంలో భారత్‌కు వచ్చిన అతిపెద్ద ఎఫ్‌డీఐ ఇదే కావడం గమనార్హం. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ సైతం హైదరాబాద్‌లోనే రూ.15 వేల కోట్లతో డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ ప్ర‌తిపాద‌న‌లు ఫ‌లించి మైక్రోసాఫ్ట్‌ డాటా సెంటర్‌ ఏర్పాటు ఖరారైతే.. ఇది ఈ విభాగంలో హైదరాబాద్‌కు వచ్చిన రెండో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కానుంది.

ఇక గ్లోబల్‌ సెర్చింజన్‌ గూగుల్‌ కూడా భారత్‌లో డాటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు స‌మాచారం. ఇప్పటికే ఈ సంస్థకు అమెరికా తర్వాత రెండో అతిపెద్ద క్యాంపస్‌ హైదరాబాద్‌లో ఉంది. ఈ నేపథ్యంలో డాటా సెంటర్‌నూ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇవన్నీ కార్యరూపం దాల్చితే త్వరలోనే హైదరాబాద్‌ ‘డాటా సెంటర్‌ హబ్‌’గా మారడం ఖాయమని నిపుణులు అంటున్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ ర‌థ‌సార‌థిగా ఉన్న స‌త్య నాదెళ్ల చొర‌వ‌తో ఈ డాటా సెంట‌ర్ హైద‌రాబాద్‌కు రావ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.