ప్రైమరీ స్కూల్స్ ఓపెన్ చేయండి..ఐసీఎంఆర్ సూచన..!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్.. తీవ్ర ప్రభావం చూపించాయి. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో.. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

అయితే… ఈ కరోనా కారణంగా.. గత ఏడాది నుంచి స్కూళ్లు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు ధైర్యం చేసి స్కూళ్లు తెరుద్దామని అనుకునేలోపు.. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ వెనకడుగు వేస్తున్నారు. ఒక వేళ కరోనా కేసులు కాస్త తగ్గినట్లుగా అనిపిస్తే… ముందుగా పెద్ద తరగతుల విద్యార్థులకు పాఠశాలలు, కాలేజీలు తెరవాలని అనుకుంటున్నారు. అయితే… ఈ విషయంలో ఐసీఎంఆర్ షాకింగ్ ప్రకటన చేసింది.

పాఠశాలలు తెరిచే ఆలోచన ఉంటే.. ఉపాధ్యాయులు, సిబ్బంది అంద‌రికీ క‌చ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయాల‌ని ఐసీఎంఆర్ సూచించింది. పెద్ద‌ల క‌న్నా పిల్ల‌లు వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల‌ను బాగా త‌ట్టుకుంటార‌ని, క‌నుక ముందుగా ప్రైమ‌రీ స్కూళ్ల‌ను ఓపెన్ చేయాల‌ని సూచించింది. యాంటీ బాడీలు పెద్ద‌లు, పిల్ల‌ల్లో ఒకే ర‌కంగా ఉంటున్నాయ‌ని స్ప‌ష్టం చేసింది.

స్కాండినేవియాలో కొన్ని ప్రైమ‌రీ స్కూళ్ల‌ను తెరిచే ఉంచార‌నే విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ బ‌ల‌రామ్ భార్గ‌వ వెల్ల‌డించారు. పిల్ల‌ల్లో కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌త‌రం అయిన కేసులు దాదాపుగా లేవ‌న్నారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు నిర్వ‌హించిన సీరో స‌ర్వేలో మూడింట రెండు వంతుల మందిలోనే యాంటీ బాడీలు ఉన్న‌ట్లు ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని, 40 కోట్ల మందికి ఇన్‌ఫెక్ష‌న్ సోకే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. అయితే ప్రైమ‌రీ స్కూళ్ల‌ను తెరిస్తే మంచిదేన‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.