తెలుగు డైరెక్టర్ని నమ్మి డబ్బు పెడుతున్న బాలీవుడ్ హీరో

ఈ మధ్యకాలంలో చాలా మంది సౌత్ డైరెక్టర్స్ బాలీవుడ్ కు వెళ్తున్నారు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీసిన సందీప్ రెడ్డి అదే సినిమాను ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. మరో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తను రూపొందించిన ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ‘హిట్’ సినిమా డైరెక్టర్ శైలేష్ కూడా బాలీవుడ్ కు వెళ్లనున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో దర్శకుడు సంకల్ప్ రెడ్డి చేరారు.

చిన్నవయసులోనే దర్శకుడిగా మారాడు సంకల్ప్ రెడ్డి. విదేశాల్లో ఫిలిం మేకింగ్ కోర్స్ నేర్చుకొని తెలుగులో సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఆయన తీసిన ‘ఘాజీ’ సినిమా రికార్డులు సృష్టించింది. రెండో సినిమాగా ‘అంతరిక్షం’ తీశారు. అది పెద్దగా ఆడనప్పటికీ సంకల్ప్ ఇమేజ్ కి మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. ఆ తరువాత నెట్ ఫ్లిక్స్ లో ‘పిట్టకథలు’ అనే వెబ్ ఫిల్మ్ లో ఓ స్టోరీ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు తన మూడో సినిమాను బాలీవుడ్ లో తీయబోతున్నారు.

బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ఇందులో హీరోగా నటించనున్నాడు. నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరించనున్నారు. తొలిసారి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. సంకల్ప్ చెప్పిన కథ విద్యుత్ కి నచ్చడంతో సినిమా నిర్మించడానికి అంగీకరించాడు. ఈ సినిమాకి ‘ఐబీ 71’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి!