తెలంగాణ‌లో పాద‌యాత్ర‌ల సీజ‌న్

తెలంగాణలో రాజ‌కీయ ప‌రిణామాలు రోజురోజుకో కొత్త మ‌లుపు తిరుగుతున్నాయి. ప్ర‌ధాన పార్టీల్లో జ‌రుగుతున్న మార్పులు రాజ‌కీయ వేడిని పెంచుతున్నాయి. ఇంకా షెడ్యూల్ వెల్ల‌డికాని హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రంలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌పున మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతుండ‌గా మ‌రోవైపు అత‌ణ్ని నిలువ‌రించేందుకు సీఎం కేసీఆర్ ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. మ‌ధ్య‌లో కాంగ్రెస్ కూడా ఆ రాజ‌కీయ మంట‌కు మ‌రింత ఆజ్యం పోస్తోంది.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెలంగాణ‌లో పాద‌యాత్ర‌ల సీజ‌న్‌కు తెర‌లేచింద‌ని చెప్పుకోవ‌చ్చు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ నేత‌ల‌కు ప్ర‌ధాన అస్త్రం ఈ పాద‌యాత్ర‌లే. ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసి వాళ్ల మెప్పును పొందే ప్ర‌య‌త్నం చేయ‌డం కోసం ఏనాటి నుంచో నేత‌లంద‌రూ ఇదే బాట‌లో సాగుతున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తెలంగాణ‌లోని చేవెళ్ల నుంచి పాద‌యాత్ర ప్రారంభించి అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న త‌ర్వాత చంద్ర‌బాబు, వైఎస్ ష‌ర్మిల‌, జ‌గ‌న్ పాద‌యాత్ర ప‌రంప‌ర‌ను కొన‌సాగించారు. ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఈటెల రాజేంద‌ర్ మ‌రోసారి ఇదే మార్గాన్ని అనుస‌రించ‌నున్నారు.

క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో సోమ‌వారం ప్రారంభ‌మ‌య్యే ఈటెల పాద‌యాత్ర 23 రోజుల పాటు సాగ‌నుంది. ప్ర‌జా జీవ‌న యాత్ర పేరుతో ఈటెల చేప‌ట్టే ఈ పాద‌యాత్ర‌లో భాగంగా నియోజ‌క‌వ‌ర్గంలోని 107 గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలోని 126 గ్రామాల‌ను చుట్టేయ‌నున్నారు. 270 కిలోమీట‌ర్ల పాటు సాగే ఈ పాద‌యాత్ర ద్వారా జ‌నాల్లోకి వెళ్లి తాను చేసిన అభివృద్ధి ప‌నుల‌ను గుర్తు చేయ‌డంతో పాటు అధికార టీఆర్ఎస్ అవ‌లంబిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌పై గ‌ళ‌మెత్త‌నున్న‌ట్లు తెలిసింది.

మ‌రోవైపు తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులు తేవ‌డంతో పాటు అధికారం చేజిక్కించుకోవ‌డ‌మే లక్ష్యంగా బీజేపీ రాష్ట్రధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆగ‌స్టు 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాద‌యాత్ర చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ పాద‌యాత్ర‌లో జాతీయ నాయ‌కులు, కేంద్ర మంత్రులు కూడా భాగ‌మ‌వుతార‌ని సంజ‌య్ వెల్ల‌డించారు. ఇక తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి కూడా పాద‌యాత్ర చేసే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన ష‌ర్మిల కూడా త్వ‌ర‌లోనే పాద‌యాత్ర చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ఈ జాబితాలోకి తీన్మార్ మ‌ల్ల‌న్న కూడా చేరారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ఆగ‌స్టు 29న అలంపూర్ జోగులాంబ ఆల‌యం నుంచి పాద‌యాత్ర ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా 6 వేల కిలోమీట‌ర్లు కొన‌సాగిస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. త‌న పాద‌యాత్ర ఓట్ల కోసం కాద‌ని, దిల్లీ సీఏం కేజ్రీవాల్‌ను ఈ పాద‌యాత్ర‌కు ఆహ్వానిస్తాన‌ని ఆయ‌న చెప్ప‌డం విశేషం.