కేంద్రం పై విజయసాయి ఫుల్లు ఫైర్..నిజమేనా ?

అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మామూలుగా అయితే ఇప్పటివరకు బీజేపీని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ వైసీపీ నుండి ఎవరు ఇంత గట్టిగా మాట్లాడలేదు. విషయం ఏదైనా ఏదో సర్దుబాటు ధోరణిలోనో, లేదా రిక్వెస్టింగ్ గానో వైసీపీ ఎంపిలు, నేతలు మాట్లాడుతున్నారు. కానీ మొదటిసారి కేంద్రంపై విజయసాయి ఇంతస్ధాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నుండి పార్లమెంటు వర్షాకల సమావేశాలు మొదలవుతున్నాయి.

ఈ సమావేశాల్లో సహకారం అందించాలని లోక్ సభ, రాజ్యసభ లో ప్రతిపక్ష నేతల సహాకారాన్ని కోరుతు సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రాజ్యసభ, లోక్ సభల్లో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయసాయి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇదంతా నిజమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సమావేశంలో అనేక అంశాలపై కేంద్రప్రభుత్వాన్ని తాము నిలదీసినట్లు విజయసాయి చెప్పారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా దిగజారిపోతుందన్న విజయసాయి వ్యాఖ్యలే సంచలనంగా మారాయి.

దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని చెప్పిన కేంద్రం మరి పుదుచ్చేరి ఎన్నికల్లో మాత్రం బీజేపీ మ్యానిఫెస్టోలో ఎలా పెట్టిందని విజయసాయి నిలదీశారట. పాండిచ్చేరికి ప్రత్యేకహోదా ఇవ్వాలని అనుకున్నపుడు ఏపికి మాత్రం ఎందుకివ్వరంటు గట్టిగా ప్రశ్నించారట. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకలాగ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల విషయంలో మరోలాగ కేంద్రంప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు సూటిగా చెప్పానని విజయసాయి చెప్పటం కరెక్టేనా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

పోలవరం పునరావాస ప్యాకేజీకి రు. 55,657 కోట్లను టెక్నికల్ కమిటి ఆమోదించినా కేంద్రం ఎందుకని పెండింగ్ లో పెట్టిందని గట్టిగా నిలదీశారట. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపికి కేంద్రం ద్రోహం చేస్తోందని ఎంపి మండిపడ్డారు. పోలవరం అథారిటిని హైదరాబాద్ నుండి రాజమండ్రి కి తరలించటంలో ఎందుకు జాప్యం జరుగుతోందని గట్టిగా ప్రశ్నించారట. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

ఇక తెలుగురాష్ట్రాల మధ్య వివాదంగా నిలిచిన నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్రం ఎందుకు పట్టించుకోవటంలేదని గట్టిగా ప్రశ్నించారట. రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని యథాతథంగా అమలు చేయకుండా ఏపికి కేంద్రం ద్రోహం చేసిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యవారణ అనుమతులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని సమావేశంలో లేవనెత్తారట. తెలంగాణా నుండి ఏపికి రావాల్సిన రు. 6112 కోట్ల విద్యత్ బకాయిలను ఇప్పించటంలో కూడా కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటు మండిపోయారు.

రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయమని తాము లేఖరాసి 11 మాసాలవుతున్నా ఎందుకని చర్యలు తీసుకోలేదని కూడా నిలదీశారట. ఇలాంటి అనేక అంశాలపై తాము కేంద్రాన్ని దుమ్ముదులిపేశామన్నట్లుగా విజయసాయి బిల్డప్ ఇచ్చారు. మీడియా సమావేశంలో చెప్పినట్లుగానే లోపల సమావేశంలో వాయించేసింది, నిలదీసింది, సూటిగా ప్రశ్నించిందంతా నిజమేనా అనే డౌట్లు పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఇదంతా నిజమే అయితే ఒక్కసారిగా కేంద్రప్రభుత్వంపై వైసీపీ వైఖరి ఎందుకు మారిందనేది అర్ధం కావటంలేదు. గడచిన ఏడేళ్ళల్లో లేని తెగింపు ఇపుడే ఎందుకు మొదలైంది ? అన్నదే ఇపుడు సస్పెన్సుగా మారింది.