తెలుగు వెబ్ సిరీస్‌ల్లో ఇదే ‘ది బెస్ట్’

నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్స్ ఇండియన్ మార్కెట్ మీద దృష్టిపెట్టాక.. ప్రధానంగా వాటి టార్గెట్ బాలీవుడ్డే అయింది. అక్కడి ఫిలిం మేకర్స్, నటీనటులతో పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌లు మొదలుపెట్టారు. పదుల సంఖ్యలో అక్కడ ఒరిజినల్స్ వచ్చాయి. ప్రముఖ నటీనటులు, దర్శకులు వాటి కోసం పని చేశారు. ఐతే తెలుగులో వెబ్ సిరీస్‌ల సంస్కృతి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. గత ఏఢాది లాక్ డౌన్ టైం నుంచే వెబ్ సిరీస్‌ల సంఖ్య పెరిగింది.

ఐతే ఇప్పటిదాకా రెండంకెల సంఖ్యలో సిరీస్‌లు వచ్చాయి కానీ.. వాటిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నవి చాలా తక్కువ. హిందీలో వచ్చే సిరీస్‌ల ప్రమాణాలకు మనవి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని అంగీకరించాల్సిందే. బాలీవుడ్ వాళ్లు తీసిన సిరీస్‌ల్లో ఉన్న వైవిధ్యం, ఉత్కంఠ, బిగి మన వాటిలో పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా వెబ్ సిరీస్‌ల్లో ఎక్కువ ఆకర్షణ ఉన్న థ్రిల్లర్ జానర్లో మన వాళ్లు సరైన సిరీస్‌లు తీయలేదు. ఇది తెలుగు ప్రేక్షకులకు నిరాశ కలిగించే విషయమే.

ఇంగ్లిష్, హిందీ సిరీస్‌లను చూస్తూ మన దగ్గర ఇలాంటివి రావట్లేదే అనుకుంటున్నారు మన ఆడియన్స్. ఐతే ఎట్టకేలకు ఆ లోటును తీరుస్తూ.. ఒక వెబ్ సిరీస్ ప్రేక్షకులను పలకరించింది. అదే.. కుడి ఎడమైతే. కన్నడలో లూసియా, యు టర్న్ లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన పవన్ కుమార్ ఆహా కోసం తీర్చిదిద్దిన సిరీస్ ఇది. అమలా పాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్ ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేశారు. గురువారమే ఈ సిరీస్‌కు ప్రిమియర్స్ పడ్డాయి. 8 ఎపిసోడ్లున్న ‘కుడి ఎడమైతే’లో కాన్సెప్టే హైలైట్.

ఇద్దరి జీవితాల్లో ఒక రోజు గడిచాక తిరిగి వాళ్లిద్దరూ అదే రోజులో ఉండిపోవడం అనే వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తెరకెక్కింది. మధ్యలో కొన్ని రిపిటీటివ్ సీన్లు, కొంచెం నెమ్మదిగా సాగే రెండు మూడు ఎపిసోడ్లను మినహాయిస్తే ‘కుడి ఎడమైతే’ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. థ్రిల్లింగ్ మూమెంట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇది టాప్ క్లాస్ సిరీస్ అనలేం కానీ.. తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన సిరీస్‌ల్లో ది బెస్ట్ అనడంలో మాత్రం సందేహం లేదు.