కరోనా థర్డ్ వేవ్ తట్టుకోవడం చాలా కష్టం..!

కరోనా మహమ్మారి మన దేశాన్ని అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆసుప‌త్రుల్లో బెడ్స్ లేక‌, ఆక్సిజ‌న్ అంద‌క‌, రోజురోజుకు పెరుగుతున్న కేసుల‌తో జ‌నం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. బెడ్ ఇప్పించండి అంటూ పైర‌వీలు చేశారు. ఆస్తులు, పుస్తెల‌మ్మి కూడా ప్రైవేటు ఆసుప‌త్రుల బిల్లులు క‌ట్టారు. కొన్ని చోట్ల అయితే క‌రోనా మృత‌దేహాల‌ను ఖ‌న‌నం చేసేందుకు కూడా క్యూలైన్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

అయితే, క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌స్తే సెకండ్ వేవ్ ను మించి ఉంటుంద‌ని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డా.ర‌ణ‌దీప్ గులేరియా. దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ముగుస్తున్నందున ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నార‌ని… కానీ ఆంక్ష‌ల స‌డ‌లింపులో ఏమాత్రం తేడా వ‌చ్చిన కేసులు పెరుగుతాయ‌న్నారు.

ఇప్ప‌టికే ఈశాన్య రాష్ట్రాలు, కేర‌ళ‌లో కేసులు పెరుగుతున్నాయ‌ని… ఆంక్ష‌లు స‌డ‌లించ‌టం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంద‌న్నారు. అదే జ‌రిగితే థ‌ర్డ్ వేవ్ భ‌యంక‌రంగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ప‌నిచేస్తున్నాయ‌ని, అందుకే థ‌ర్డ్ వేవ్ వ‌స్తున్న దేశాల్లో మ‌ర‌ణాల శాతంతో పాటు ఆసుప‌త్రికి వెళ్లాల్సిన అవ‌స‌రం త‌గ్గుతుంద‌ని డా.గులేరియా వివ‌రించారు. థ‌ర్డ్ వేవ్ రాక‌ముందే జ‌నం టీకాలు తీసుకోవ‌టం మంచిద‌ని సూచించారు.