నెట్ ఫ్లిక్స్‌లో విరాటపర్వం?

Virata Parvam

ఎగ్జిబిటర్లు తీవ్ర హెచ్చరికలు చేసినా.. అభిమానుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినా అగ్ర నిర్మాత సురేష్ బాబు వెనక్కి తగ్గలేదు. తన నిర్మాణంలో తెరకెక్కిన మూడు చిత్రాల్లో ఒకదాన్ని ఇప్పటికే ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేసేశారు. అదే.. నారప్ప. ఈ నెల 20న ఈ సినిమా అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంలో రూపొందించిన ‘దృశ్యం-2’, ‘విరాటపర్వం’ చిత్రాలను కూడా సురేష్ ఓటీటీలకు ఇచ్చేసినట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఐతే వాటి గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘దృశ్యం-2’ ప్రైమ్ లేదా హాట్ స్టార్‌లో రావచ్చని అంటున్నారు. కాగా ‘విరాటపర్వం’ మీద ముందు నుంచి ఒక స్పష్టత లేదు. ఆ చిత్రం థియేటర్లలోనే రిలీజవుతుందని కొందరు.. లేదు లేదు ఓటీటీ డీల్ విషయంలో చర్చలు తుది దశలో ఉన్నాయని.. అది కూడా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమవుతోందని కొందరు అంటూ వచ్చారు.

కాగా తాజా సమాచారం ప్రకారం ‘విరాటపర్వం’కు కూడా ఓటీటీ డీల్ పూర్తయిందట. దీన్ని స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఎక్కువగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలను కొంటుంటారు. ‘విరాటపర్వం’ నెట్ ఫ్లిక్స్ శైలికి తగ్గ సినిమా. ఈ చిత్రానికి మంచి రేటే ఇచ్చి కొనుగోలు చేశారని.. త్వరలోనే అనౌన్స్‌మెంట్ రాబోతోందని అంటున్నారు.

దీంతో పాటు ‘దృశ్యం-2’ సంగతి కూడా సురేష్ బాబు త్వరలోనే తేల్చేస్తారని చెబుతున్నారు. ‘నీదీ నాదీ ఒకే కథ’ దర్శకుడు వేణు ఉడుగుల రూపొందించిన ఈ చిత్రంలో సురేష్ తనయుడు రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటించగా.. సాయిపల్లవి హీరోయిన్‌గా చేసింది. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించింది. మూడు దశాబ్దాల కిందట, నక్సలిజం నేపథ్యంలో నడిచే కథ ఇది. దీని టీజర్, ఇతర ప్రోమోలు చాలా ఇంటెన్స్‌గా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.