ట్రైలర్ టాక్: సైకోకు సాయం చేసే హీరోయిన్

తమిళంలో థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాం ద్వారా రిలీజ్ కాబోతున్న తొలి పేరున్న సినిమా ‘పొన్ మగల్ వందాల్’. జ్యోతిక ప్రధాన పాత్రలో ఆమె భర్త సూర్య ఈ చిత్రాన్ని నిర్మించాడు. జేజే ఫ్రెడరిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మే 29న ఈ సినిమా అమేజాన్‌లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్రైలర్ కూడా వదిలారు. ఇదొక కోర్ట్ రూం డ్రామా అన్న సంగతి పోస్టర్లు చూస్తేనే అర్థమైపోతుంది.

ఈ కథ లోతుల్లోకి వెళ్తే.. ఐదుగురు పిల్లల్ని కిరాతకంగా హత్య చేసిన ఓ లేడీ సైకో కేసు విచారణ చుట్టూ నడుస్తుంది. హీరోయిన్ ఆ సైకో లేడీ తరఫునే వాదిస్తుంది. ఆ సైకోకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో ఈ కేసు క్లోజ్ అయిపోయిందనే అంతా అనుకుంటారు. కానీ దీన్ని జ్యోతిక రీఓపెన్ చేయించి.. ఆమె తరఫున వాదించేందుకు సిద్ధమవుతుంది.

ఈ హత్యల తాలూకు బాధితులు ఆమెకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు. తనపైకి చెప్పులు కూడా విసురుతారు. ఐతే ఈ కేసులో అసలు దోషులు వేరని.. వాళ్లను తప్పించేందుకు నేరం ఆ అమ్మాయి మీదికి నెట్టేశారని హీరోయిన్ భావిస్తుంది. మరి అందుకు ఆమె ఏం చేసింది.. ఎలాంటి సాక్ష్యాలు సేకరించింది. కోర్టులో ఎలా వాదించి అసలు దోషుల్ని వెలుగులోకి తెచ్చింది అన్నది మిగతా కథ. అనేక ట్విస్టులతో కథనం ఉత్కంఠభరితంగా సాగుతుందని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. జ్యోతిక స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.

ఆమె సినిమాను తన భుజాల మీద నడిపించినట్లే ఉంది. పార్తీబన్, భాగ్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల థియేటర్ల యాజమాన్య సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం.. నిర్మాత సూర్యకు హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. ఐతే తన సినిమా తన ఇష్టమంటూ నిర్మాతల మద్దతు సంపాదించి అమేజాన్‌లో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశాడు సూర్య.