అఖిల జర్నీ క్లైమ్యాక్సికి వచ్చినట్లేనా ?

రాజకీయంగా అత్యంత క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటున్న మాజీమంత్రి భూమా అఖిలప్రియ టీడీపీ పొలిటికల్ జర్నీ క్లైమ్యాక్సికి చేరుకున్నట్లే అనిపిస్తోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది. కర్నూలు జిల్లాలో చాలామంది సీనియర్ నేతలున్నప్పటికీ పరిస్ధితుల కారణంగా అఖిలప్రియను చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చిన్న వయసులోనే మంత్రయిపోవటంతో అఖిల రాజకీయ బ్యాలెన్సును కోల్పోయారు.

చిన్న వయసులోనే అఖిల మంత్రవ్వటానికి కారణం తల్లి, దండ్రులను కోల్పోయిన కాంపాషినేట్ గ్రౌండ్స్ లో మాత్రమే. అయితే ఆ విషయాన్ని మరచిపోయిన మాజీమంత్రి అందరితోను శతృత్వం పెంచుకున్నారు. ఎవరినిపడితే వాళ్ళని నోటికొచ్చినట్లు మాట్లాడటంతో దగ్గరవాళ్ళే చివరకు దూరమైపోయారు. ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా వ్యవహరశైలిలో మార్పు రాకపోవటంతో ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టేశాయి.

భర్త భార్గవరామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి దూకుడు స్వభావం అఖిల నోటిదురుసుకు తోడయ్యింది. ఇంకేముంది అగ్నికి ఆజ్యం తోడైనట్లే అయిపోయింది వ్యవహారం. ఈ కుటుంబంపై ఎక్కడ చూసినా కేసులే. అఖిల+భార్గవ్+జగత్ పై ధౌర్జన్యాలు, దొమ్మీలు, కిడ్నాపులు, సంతకాల పోర్జరీ, తప్పుడు సర్టిఫికేట్లు ఇలా ఒకటేమిటి వీళ్ళపై చాలా కేసులే నమోదయ్యాయి. దగ్గర బంధువులే వీళ్ళపై అనేక కేసులు పెట్టారు. పార్టీలో వీళ్ళకు మద్దతుగా ఎవరు లేనట్లే.

నిజానికి అఖిల వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగానే తయారైంది. అందుకనే అఖిలతో నేతల్లో చాలామంది మాట్లాడటమే మానేశారట. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టాలన్నా అనుమతి నిరాకరించినట్లు సమాచారం. చంద్రబాబు కూడా అఖిలకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పార్టీలో అఖిల కత క్లైమ్యాక్సికి వచ్చేసినట్లే అనిపిస్తోంది. కాకపోతే బయటకు పంపేయటానికి ముహూర్తం ఒక్కటే ఖరారు కాలేదు.