‘హరిహర వీరమల్లు’ ఔట్.. ‘ఏకే’ రీమేక్ ఇన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో ‘హరిహర వీరమల్లు’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది. పవన్ గెటప్, కాస్ట్యూమ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. ఆ విధంగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్ చేసినట్లుగా ఏదీ జరగడం లేదు.

దీంతో ఈ సినిమా సంక్రాంతికి రాదనే వార్తలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ నిర్మాత ఏ ఎమ్ రత్నం స్టేట్మెంట్ ఇచ్చారు. సినిమా అనుకున్న టైమ్ కి వచ్చి తీరుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మారిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ముందుగా ‘ఏకే’ రీమేక్ ను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

ఈ విషయమై దర్శకుడు క్రిష్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. రెండు చిత్రాల దర్శకనిర్మాతలు ఒక మాట మీదకు రావడంతో ఇప్పుడు ‘హరిహర వీరమల్లు’ సినిమాను వాయిదా వేయనున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వలన పోస్ట్ ప్రొడక్షన్ కు, వీఎఫ్ఎక్స్ కు కావాల్సినంత సమయం దొరుకుతుందని భావిస్తున్నారు. కాబట్టి వచ్చే సంక్రాంతికి ‘హరిహర వీరమల్లు’ రాకపోయినా.. ‘ఏకే’ రీమేక్ మాత్రం రెడీగా ఉంటుందని తెలుస్తోంది.