ఫస్ట్ షో ఎవరిది?

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి బాగానే తగ్గింది. దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య 35 వేలకు పడిపోయింది. గత వంద రోజుల్లో ఎన్నడూ ఇంత తక్కువ కేసులు నమోదు కాలేదు. దీంతో నార్మల్సీ వచ్చేసినట్లే అని అంతా భావిస్తున్నారు. అన్ని రకాల వ్యాపారాలు, కార్యకలాపాలు ఒకప్పట్లా కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ టైంలో మాదిరే చివరగా పున:ప్రారంభం కానున్నది థియేటర్ ఇండస్ట్రీనే. దేశవ్యాప్తంగా నెమ్మదిగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి కొన్ని రోజుల్లోనే వెండి తెరల్లో వెలుగులు నిండబోతున్నాయి.

ఐతే థియేటర్లు తెరుచుకున్న వెంటనే కొత్త సినిమాలు ఆడే పరిస్థితి అయితే లేదు. వారం లేదా రెండు వారాలు ఆగాల్సిందే. ట్రయల్ రన్ కింద పాత సినిమాలు నడిపించి.. ఆ తర్వాత కొత్త చిత్రాలు రిలీజ్ చేయబోతున్నారు.

థియేటర్ల పున:ప్రారంభం తర్వాత కొత్త చిత్రాలను విడుదల చేయడంలో కొంచెం రిస్క్ ఉంది. అదే సమయంలో అది అడ్వాంటేజ్ కూడా కావచ్చు. ప్రేక్షకులు వెంటనే థియేటర్లకు రాకపోతే సినిమా అన్యాయం అయిపోతుంది. అదే సమయంలో గత ఏడాది పోస్ట్ కరోనా ఫస్ట్ రిలీజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’కు కంటెంట్‌తో సంబంధం లేకుండా మంచి ఫలితం దక్కింది. మరి ఫస్ట్ కాపీలతో రెడీగా ఉన్న లవ్ స్టోరి, టక్ జగదీష్ లాంటి చిత్రాలు ధైర్యం చేస్తాయేమో చూడాలి. ఐతే ముందు ఒకట్రెండు చిన్న సినిమాలే విడుదల కావచ్చని.. ఆ తర్వాత ఈ సినిమాలు బరిలోకి దిగొచ్చని అంటున్నారు.

ముందు అనుకున్నట్లే కిరణ్ అబ్బవరం చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఆగస్టు 3న రిలీజవుతుందని.. ఈ లోపు వేరే సినిమాలు రాకుంటే అదే పోస్ట్ సెకండ్ వేవ్ నోటెడ్ రిలీజ్ కావచ్చని అంటున్నారు. సెకండ్ వేవ్‌కు ముందు విడుదలకు రెడీ అయి ఆగిపోయిన తేజ సజ్జా సినిమా ‘ఇష్క్’ కూడా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి దిగుదామా అని చూస్తోంది. ఇలాంటి చిన్న సినిమాలు రెండు మూడు పడ్డాక థియేటర్లు ఊపందుకుంటే లవ్ స్టోరి, టక్ జగదీష్ రేసులోకి రావచ్చు. ఆ రెండు చిత్రాలూ ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని భావిస్తున్నారు.