మహేష్-రాజమౌళి.. ఆ బ్యాక్‌డ్రాప్ నిజమే


మహేష్ బాబు చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిలిం వచ్చే ఏడాది మొదలు కాబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో జట్టు కట్టబోతున్నాడు మహేష్. జక్కన్నతో పని చేయాలని మహేష్ ఎప్పట్నుంచో కోరుకుంటున్నాడు. పదేళ్ల కిందటే వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ అనివార్య కారణాలతో సినిమా పట్టాలెక్కలేదు. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్‌తో తన సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తనకు ఎప్పట్నుంచో కమిట్మెంట్ ఉన్న సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ నిర్మాణంలో జక్కన్న ఈ చిత్రం చేయబోతున్నాడు.

ఐతే మహేష్-రాజమౌళి సినిమా కథ నేపథ్యం గురించి కొన్ని నెలల ముందే ఓ ఆసక్తికర ప్రచారం జరిగింది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే నిర్మాత నారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా కథ బ్యాక్ డ్రాప్‌ ఏంటో తనకు కూడా తెలియదని, మీడియాలో వస్తున్నవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు. దీంతో ఈ ప్రచారానికి తెరపడింది. కానీ ఇప్పుడు స్వయంగా రాజమౌళి తండ్రి, ఈ చిత్రానికి కథ రాస్తున్న విజయేంద్ర ప్రసాదే ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్ గురించి మాట్లాడటం విశేషం.

మహేష్‌తో రాజమౌళి చేయాల్సిన సినిమాకు కథ ఇంకా సిద్ధం కాలేదని.. కథా చర్చలు నడుస్తున్నాయని విజయేంద్ర ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐతే రెండు రకాల కథల మీద పని చేస్తున్నామని.. అందులో ఒక కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో నడిచేదే అని విజయేంద్ర చెప్పడం విశేషం. త్వరలో కథపై ఓ నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు. ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్లు చేసే మహేష్‌ను రాజమౌళి సినిమాలో కొంచెం రఫ్‌గా చూడాలని, జక్కన్న స్టయిల్లోనే వయొలెంట్‌గా కనిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యం తీసుకుంటే మహేష్‌కు కచ్చితంగా ఇదొక డిఫరెంట్ ఫిలిం అవుతుందనడంలో సందేహం లేదు.