మంత్రి రేసులో ముగ్గురు కృష్ణా నేత‌లు…!

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న విష‌యంపై సీఎం జ‌గ‌న్ నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు అంద‌లేదు. కానీ, కేబినెట్‌లో సీటు ద‌క్కించుకు నేందుకు మాత్రం నేత‌లు ప‌రుగులు పెడుతున్నారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు మంత్రి వ‌ర్గంలో స్థానం కోసం కుస్తీలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు కృష్ణాజిల్లా నుంచి ఒక‌రి పేరు ప్ర‌ముఖంగా వినిపించిన విష‌యం తెలిసిందే. వైఎస్ హ‌యాంలో మంత్రిగా చేసిన పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సార‌థి.. మంత్రి వ‌ర్గంలో చోటు కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే. ఆయ‌న‌కు విప్ హోదా ఇవ్వ‌డంతోపాటు టీటీడీ బోర్డు ప‌ద‌వి కూడా ఇచ్చారు.

అయితే.. త్వ‌ర‌లోనే జ‌రుగుతుంద‌ని భావిస్తున్న కేబినెట్ విస్త‌ర‌ణ‌పై కొలుసు పార్థ‌సార‌థి భారీగానే ఆశ‌లు పెట్టున్నారు. బీసీ కోటాలో అయినా.. త‌న‌కు ఖ‌చ్చితంగా ద‌క్కుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. అయితే బీసీ యాద‌వ కోటాలో అనిల్‌ను కొన‌సాగించే ఛాన్సులు ఉన్నాయి. అదే జ‌రిగితే పార్థ‌సార‌థికి మంత్రి ప‌ద‌వి ఖ‌చ్చితంగా ద‌క్క‌దు. ఇదిలావుంటే, ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి మ‌రో ఇద్ద‌రి పేర్లు తెర‌మీదికి వ‌చ్చాయి. వీరిలో పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ పేరు భారీగా వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో ఫైర్ బ్రాండ్ నేత‌గా ఆయ‌న గుర్తింపు కోసం పాకులాడుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. పార్టీ విష‌యంలోనూ ఆయ‌న దూకుడుగా ఉన్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు జ‌గ‌న్ మంచి ఛాన్స్ ఇస్తార‌ని ఆయ‌న చెబుతున్నారు. ఇక‌, ఇప్పుడు మ‌రో కొత్త పేరు తెర‌మీద‌కి వ‌చ్చింది. తెలంగాణ‌లో రాజ్యం అంతా వెల‌మ‌ల‌దే అన్న‌ట్టుగా ఉంది. అక్క‌డ సీఎం కేసీఆర్ కాకుండా.. మ‌రో న‌లుగురు మంత్రులు ఉన్నారు. ఏపీలో ఈ వ‌ర్గం నుంచి ఎవ్వ‌రూ మంత్రులు లేరు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో సుజ‌య్ కృష్ణ రంగారావు ఈ సామాజిక వ‌ర్గం నుంచి మంత్రిగా ఉన్నారు.

ఇప్పుడు ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన నూజివీడు ఎమ్మెల్యే వెంక‌ట ప్ర‌తాప్ అప్పారావు.. కేబినెట్‌లో త‌న‌కు చోటు ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. త‌న‌కు అవ‌కాశం ఇస్తే ఏపీలో వెల‌మ‌ సామాజిక వ‌ర్గాన్ని ఏక‌తాటిపైకి తెస్తాన‌ని ఆయ‌న అంటున్నారు. దీంతో ఈయ‌న కూడా త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో మునిగిపోయార‌ని తెలుస్తోంది. మ‌రి ఇప్పుడు ఉన్న ముగ్గురు మంత్రుల్లో జ‌గ‌న్ ఎవ‌రిని త‌ప్పించి… కొత్త‌గా ఎవ‌రికి ఛాన్స్ ఇస్తారో ? చూడాలి.