ఈటల‌ విష‌యంలో కేసీఆర్‌లో భ‌యం మొద‌లైందా?

తెలంగాణ‌లో ఇప్పుడు హాట్ టాపిక్ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం. ఈట‌ల రాజీనామ ఆమోదం పొందిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండటం ఖాయ‌మైపోయింది. ఈ ఎన్నిక స‌హ‌జంగానే ఇటు ఈట‌లకు అటు సీఎం కేసీఆర్‌కు ప్ర‌తిష్టాత్మ‌కం. గెలుపు టీఆర్ఎస్ పార్టీదేన‌ని గులాబీ నేత‌లు ధీమ వ్య‌క్తం చేస్తున్నప్ప‌టికీ లోలోప‌ల మాత్రం లెక్క‌ల్లో తేడా రాకుండా జాగ్ర‌త్త ప‌డుత‌న్న‌ట్లు చెప్తున్నారు. ఒకర‌కంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఎన్నిక విష‌యంలో ఎక్కువ జాగ్ర‌త్తే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

హుజురాబాద్ ఎన్నిక విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీస‌కుంటున్నార‌నేందుకు తాజాగా చోటు చేసుకున్న రెండు ప‌రిణామాలే ఉదాహ‌ర‌ణ అంటున్నారు. దీర్ఘ‌కాలంగా పెండిగ్‌లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నిక‌ల హామీ అయిన 57 ఏళ్ల వ‌య‌సు వారికి పెన్ష‌న్ అనే మాట‌ను తాజాగా కేసీఆర్ నిలుపుకొన్నారు. త‌న కుమారుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల టూరులో ఈ మేర‌కు కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసేశారు. త‌ద్వారా వృద్ధుల్లో ఆశ‌లు రేకెత్తించేశారు.

ఇక తెలంగాణ‌లో నిరాశ‌గా ఉన్న మ‌రో సెక్ష‌న్ అయిన యువ‌త‌ను సైతం కూల్ చేసేలా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల కల త్వరలోనే సాకారం అయ్యేలా నిర్ణ‌యాలు తీసుకున్నారు. పోలీస్‌ శాఖలో ఉన్న 19 వేల పైచిలుకు కానిస్టేబుల్ పోస్టులు.. 625 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. పోలీస్ శాఖలో ఖాళీలను గుర్తించి డీజీపీ ఆర్థిక శాఖకు నివేదిక పంపించారు . ఆర్థిక శాఖ ఆమోదం రాగానే పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ కానుంది. త‌ద్వారా యువ‌త నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డ‌నుంది. అయితే, ఈ కీల‌క అడుగుల వెనుక కార‌ణం హుజురాబాద్ ఉప ఎన్నిక అంటూ కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు.