తెలంగాణలో ఏ ఒక్క సీమాంధ్రుడికైనా ఇబ్బంది కలిగిందా?

అనూహ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న నీటి పంచాయితీ అంతకంతకూ ముదురుతోంది. ఇదిలా ఉంటే.. దీనికి మించిన మాటల యుద్ధానికి తెర తీశారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. టీఆర్ఎస్ నేతలు. అందుకు భిన్నంగా ఏపీ అధికారపక్ష నేతలు మాత్రం ఆచితూచి అన్నట్లు వ్యాఖ్యలు చేశారే కానీ ఎక్కడా ఒక్క మాట అదనంగా అనేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు.

దూకుడుగా వ్యవహరించే తమ సహజ తీరుకు భిన్నంగా వైసీపీ నేతలు వ్యవహరించారు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అన్నింటికి మించి దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి.. నరరూప రాక్షసుడంటూ తెలంగాణ అధికారపక్ష నేత చేసిన వ్యాఖ్య తీవ్ర ఆగ్రహాన్ని కలిగించినప్పటికీ.. ఘాటుగా రియాక్టు కాకుండా మిన్నకుండిపోయారు. వైసీపీ నేతల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ను ఉద్దేశించి అన్నేసి మాటలు అంటుంటే.. అలా ఎలా ఊరుకుంటారన్న చర్చ మొదలైంది.

ఇలాంటి సమయంలోనే జరిగిన ఏపీ కాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ నేతల తీరు.. జలవివాదం వేళ వారు స్పందించిన తీరు చర్చకు వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తాను సంయమనం పాటిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. దీంతో.. అప్పటివరకు దూకుడుగా వెళ్లిన టీఆర్ఎస్ నేతల వేగానికి బ్రేకులు పడ్డాయి.

ఇదే వ్యాఖ్యపై తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఏ ఒక్క సీమాంధ్రుడికైనా ఇబ్బంది కలిగిందా? అని ప్రశ్నించటం ద్వారా.. జగన్ నోటి నుంచి ఒక్క వ్యాఖ్య ఎంతటి ప్రభావాన్ని చూపించిందన్నది ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు. కృష్ణా, తుంగభద్రలపై అక్రమంగా ప్రాజెక్టులను చేపడుతూ.. తమపైనే నిందలు వేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

గతంలో మాదిరి వైఎస్ మీద విపరీత వ్యాఖ్యలు చేయకుండా శ్రీనివాస్ గౌడ్ తనను తాను కంట్రోల్ చేసుకోవటం కనిపిస్తుంది. రాష్ట్ర హక్కులను కాపాడుకోవటం కోసం ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో.. నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్న విషయాన్ని శ్రీనివాస్ గౌడ్ తెలుసుకుంటే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.