చైనా మ‌రో పైశాచికం.. క‌రోనా విష‌యంలో ఏం చేస్తోందంటే

డ్రాగ‌న్ కంట్రీ చైనా.. మ‌రో పైశాచానికి తెర‌దీసిందా? క‌రోనా పుట్టుక‌కు.. కేంద్ర‌మైన చైనా.. ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. వూహాన్ న‌గ‌రంలో తొలి కేసు న‌మోదు కావ‌డం మొద‌లు.. ప్ర‌పంచం మొత్తం క‌రోనా గుప్పిట్లోకి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఫ‌లితంగా ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలి.. ఉద్యోగాలు పోయి.. కుటుంబాల‌కు కుటుంబాలే ఆప్తుల‌ను పోగొట్టుకుని రోడ్డున ప‌డ్డ విల‌యం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ విప‌రీతానికి చైనానే కార‌ణ‌మ‌ని.. చైనా మూల్యం చెల్లించుకోవాల్సిందేన‌ని అమెరికా స‌హా కొన్ని అగ్ర‌రాజ్యాలు డిమాండ్లు చేస్తున్నాయి.

చైనా ల్యాబ్‌లోనే క‌రోనా పుట్టింద‌నే వాద‌న కూడా ఉంది. ఈ క్ర‌మంలో డ్రాగ‌న్ కంట్రీ.. మ‌రో పైశాచిక కృత్యానికి తెర‌దీసింది. క‌రోనా ఆన‌వాళ్లు క‌నిపించ‌కుండా వ్య‌వ‌హ‌రిస్తోంది. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అందుకు బలాన్నిచ్చే సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనా జన్యుక్రమానికి సంబంధించిన తొలినాళ్ల నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్‌ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం.

కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ చైనా యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు. కరోనా వైరస్‌ విజృంభించిన తొలినాళ్లలో చైనా విడుదల చేసిన వైరస్‌ టెస్ట్‌ సీక్వెన్సులను అంతర్జాతీయ డేటాబేస్‌ల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాలో ప్రముఖ వైరాలజిస్ట్‌ జెస్సీ బ్లూమ్‌ తెలిపారు. ముఖ్యంగా కరోనా మూలాలు కనిపించకుండా చేసేందుకే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌)కు సంబంధించిన ‘సీక్వెన్స్‌ రీడ్‌ ఆర్కైవ్‌’ నుంచి వాటిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.

వైరస్‌ వెలుగుచూసిన సమయంలో వుహాన్‌లో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాల సమాచారమే తొలగించిన వాటిలో ఎక్కువగా ఉందన్నారు. కొవిడ్‌ మూలాలు, విస్తృతిని అర్థం చేసుకోవడంలో అత్యంత కీలకమైన ఇటువంటి డజనుకుపైగా నివేదికలను చైనా తొలగించినట్లు తెలిపారు. వైరస్‌ పరిణామ క్రమంపై గందరగోళం సృష్టించడానికే చైనా ఈ పన్నాగాలు పన్నినట్లు భావిస్తున్నామన్నారు. వుహాన్‌లోని స్థానిక మార్కెట్‌లో కరోనా వైరస్‌ వెలుగుచూడక ముందే నగరంలో పలుచోట్ల వైరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో చైనా ఇప్పుడు డేటాబేస్ నుంచి స‌మాచారాన్ని తొల‌గించ‌డం ద్వారా ప్ర‌పంచం చెవిలో పూలు పెడుతోంద‌ని అంటున్నారు.